ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఎఫ్‌ జమ ఇక మరింత సులభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 06, 2017, 09:58 AM

ఇకపై ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) జమలు, ఉపసంహరణలు చాలా సులువుగా పూర్తికానున్నాయి. పీఎఫ్‌ బకాయిల వసూళ్లతో పాటు పీఎఫ్‌ ఉపసంహరణ, పింఛను, బీమా చెల్లింపుల నిమిత్తం ఐదు బ్యాంకులతో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఒప్పందం కుదర్చుకుంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సమక్షంలో ఈపీఎఫ్ఓ అధికారులు, బ్యాంకు ప్రతినిధులు బుధవారం న్యూఢిల్లీలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఒప్పందాలపై సంతకాలు చేశాయి.


ఈ ఐదు బ్యాంకుల్లో ఖాతాలున్న సంస్థల యజమానులు తమ ఉద్యోగుల పీఎఫ్‌ మొత్తాలను ఇకపై నేరుగా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా క్షణాల్లో ఈపీఎఫ్ఓకు జమ చేసేయొచ్చు. తాజా ఒప్పందం కారణంగా ఈపీఎఫ్‌ఓకి ఏటా రూ.125 కోట్ల వరకు ఖర్చు మిగిలే వీలుంది. ‘గతంలో ఒక్క ఎస్‌బీఐ ద్వారానే ఈపీఎఫ్‌ఓ లావాదేవీలన్నీ జరిగేవి. ఒక్కో లావాదేవీకి సగటున రూ.12 ఖర్చయ్యేది. పీఎఫ్‌ సంస్థపై ఏడాదికి రూ.350 కోట్ల వరకు భారం పడుతుండేది. ఎస్‌బీఐతో పాటు పీఎస్‌బీ, అలహాబాద్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు ఆన్‌లైన్‌ ద్వారా బకాయిలను వసూలు చేస్తుండటంతో ఈ భారం రూ.175 కోట్లు తగ్గింది’ అని సెంట్రల్‌ ప్రావిడంట్‌ ఫండ్‌ కమిషనర్‌ వి.పి.జోయ్‌ తెలిపారు.


ఇప్పుడు తాజాగా మరో ఐదు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకోవడంతో ఏడాదికి ఈ వ్యయం రూ.125 కోట్లు తగ్గి రూ.50 కోట్లకు పరిమితమవుతుందని అన్నారు. అలాగే మరో ఏడు బ్యాంకులు.. ఐడీబీఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలతోనూ ఒప్పందం కుదుర్చుకునేందుకు ఈపీఎఫ్‌ఓ చర్చలు జరుపుతోంది. లావాదేవీల భారం తగ్గుతుండటంతో నిర్వహణ రుసుంను తగ్గించడంపై ఈపీఎఫ్‌ఈ దృష్టి సారించే అవకాశం ఉందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com