రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జేసి మార్కండేయులు సంబందిత అధికారులకు సూచించారు. సోమవారం రేణిగుంట విమానాశ్రయంలో ఐజీ శశిధర రెడ్డి, జేసి , అర్బన్ ఎస్.పి. రమేష్ రెడ్డి, భద్రతా అధికారులు, విధులు కేటాయించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు.జేసి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23, 24 తేదీలలో పర్యటించనున్నారని జెసి మార్కండేయులు తెలిపారు. ఈ నెల 23 బుధవారం మధ్యాహ్నం 3.05 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి 3.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం ముఖ్యమంత్రి రోడ్డుమార్గన తిరుమల శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 5.45 గంటలకు బేడిఆంజనేయ స్వామి ఆలయం చేరుకుని అక్కడి నుండి ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించడానికి శ్రీవారి ఆలయం చేరుకుని శ్రీవారికి సమర్పించి, శ్రీవారిని దర్శించుకుని రాత్రి 7.10 గంటలకు శ్రీ పద్మావతి అతిధిగృహం చేరుకుని బస చేస్తారు.
గురువారం ఉదయం 6.25 గంటలకు మరోమారు శ్రీవారిని దర్శించుకుని నాద నీరాజనం సుందర కాండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 8.10 గంటలకు కర్నాటక రాష్ట్ర ఛారిటీస్ సత్రాలకు శంఖుస్థాపన చేయనున్నారు. తిరుమల నుండి 9 గంటలకు బయలుదేరి 10.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నావరం బయలుదేరనున్నారని తెలిపారు.
ఐజీ శశిధర రెడ్డి, అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ముఖ్యమంత్రి పర్యటనలో భద్రత , ప్రయాణ మార్గంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రయాణించనున్న రోడ్డు మార్గాన ముందస్తు వాహన శ్రేణి పరిశీలించారు. తిరుమలలో ముఖ్యమంత్రి బస చేయనున్న శ్రీ పద్మావతీ అతిథి గృహం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీవారి ఆలయం ప్రాంగణం , నాదనీరాజనం ప్రాంగణం, కర్నాటక రాష్ట్ర ఛారిటీస్ సత్రం శంఖుస్థాపన ప్రాంతం వద్ద ఏర్పాట్లు పరిశీలించారు.
రహదారికి ఇరువైపుల అవసరమున్న చోట బారీకేడ్లు ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రథమశ్రేణి వాహన పరిశీలనలో, సమీక్షలో పాల్గొన్న తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ గిరీషా , ఎయిర్పోర్టు డైరెక్టర్ సురేష్, చీఫ్ విమానాశ్రయ భద్రతా అధికారి దుర్గేష్ చంద్ర శుక్లా, సి.ఎస్.ఓ. రాజశేఖర్ రెడ్డి, రేణిగుంట డిఎస్పీ చంద్రశేఖర్,తిరుపతి రూరల్ తహశీల్దార్ కిరణ్ కుమార్ , రేణిగుంట ఇంచార్జి తహశీల్దార్ శివప్రసాద్, రుయా సూపరింటెండెంట్ డా.భారతి, ఈఈ ఆర్.అండ్ బి సహదేవ రెడ్డి,108 డి.ఎం. భాస్కరరావు, ఎ.ఎస్.ఓ. ఝాన్సీ లక్ష్మి, ఎస్పీడిసిఎల్ ఎస్.ఈ. చలపతి, సమాచార శాఖ ఎడి పద్మజ, తదితర అధికారులు పాల్గొన్నారు.