కేరళలోని కొచ్చిలో చోటుచేసుకున్న ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. అనంతు విజయన్ అనే 24 ఏళ్ల వ్యక్తి కొచ్చిలోని ఓ ఆలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం రోజున అతను తన స్నేహితులో సరదాగా.. ''ఈ రోజు సాయంత్రానికి కల్ల లాటరీలో నేను ప్రైజ్ మనీ 12 కోట్ల రూపాయలను ఇంటికి తెస్తాను" అని అన్నాడు. దీనికి వాళ్లు పగలబడి నవ్వారు. ఇలా తన మీద తానే జోకులు వేసుకున్నాడు. అయితే ఆ తర్వాత కొద్ది గంటలకే అతని జీవితంలో అద్బుతం జరిగింది. అతను సరదాగా మాట్లాడిన మాటలు నిజమయ్యాయి. కేరళ ఓనమ్ బంపర్ లాటరీ ప్రైజ్ మనీ విజేతగా నిలిచాడు. సరిగ్గా ఒక్క రోజులోనే అతడు మిలియనీర్గా మారిపోయాడు. అయితే తాను కొద్దిసేపటి క్రితం చెప్పిన మాటలు నిజం కావడంతో ఆ షాక్లోనే ఉండిపోయాడు. ఇక, ఆ రోజు రెండు గంటలే నిద్రపోయాడు. విజయన్ది కేరళలోని ఇడుక్కికి సమీపంలోని తోవాల స్వస్థలం. అతడి తండ్రి పెయింటర్గా ఉన్నాడు. పీజీ పూర్తి చేసి.. ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్న అతడి అక్క.. లాక్డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయింది. ఇక, విజయన్ తమ్ముడు బీబీఏ పూర్తి చేసి ఎంబీఏ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మ ఇంటిపనులు చూసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో లాక్డౌన్ నుంచి కటుంబపోషణ మొత్తం విజయన్ మీదనే పడింది. అయితే ఆ సమయంలోనే విజయన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే పనిగా BR 75 TB 173964 నెంబర్ గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.లాటరీ రిజల్ట్ ప్రకటించే రోజు సాయంత్రం 5.30 గంటలకు అతను తన టికెట్ బయటకు తీసి ఆ నంబర్.. రిజల్ట్తో మ్యాచ్ అవుతుందా లేదా అని చూశాడు. అయితే తను ఫ్రైజ్ మనీ గెలుచుకున్నట్టు తేలడంతో ఆనందంలో ఉబ్బితబ్బిబయ్యాడు. జీవితంలో అతి పెద్ద మలుపు చోటుచేసుకోవడంతో.. అతని మొదడులో అనేక రకాల ఆలోచనలు కదలసాగాయి. దీనిపై విజయన్ స్పందిస్తూ.. "నేను ఈ విషయాన్ని మొదట నా తల్లిదండ్రులకు చెప్పాను.. వాళ్లు ఆశ్చర్యపోయారు. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. ఈ ఉత్సహాన్ని ఆపడానికి నాకు చాలా గంటలు పట్టింది. నేను కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయాను" అని న్యూస్ 18తో తెలిపాడు. ఇక, విజయన్ ఇంటర్ నుంచి తన చదవులకు అయ్యే ఖర్చును తనే సమకూర్చుకునే వాడు. పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ క్రిస్ట్ కాలేజ్లో బ్యాచ్లర్ పూర్తి చేశాడు. రెండేళ్లపాటు ఎర్నాకుళం కదవంద్రలోని పొన్నెత్ ఆలయంలో క్లర్క్గా పనిచేస్తున్నాడు. ఇక, లాటరీలో గెలుపొందినందుకు ట్యాక్స్ కట్టింపు మినహాయించి అతని చేతికి రూ. 7.57 కోట్లు అందనున్నాయి. అతనికి టికెట్ అమ్మిన కందవంద్రలోని లాటరీ అమ్మకపుదారుడికి రూ. 1.20 కోట్ల కమిషన్ దక్కనుంది.