ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మరింతగా తగ్గుముఖం పట్టాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కరోనా శాంతించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో గడిచిన 24 గంటల్లో 56,569 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 6,232 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 6,31,749కు చేరుకున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం కరోనా బారినపడి 57 మరణించగా, సోమవారానికి ఆ సంఖ్య 51కి తగ్గింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,410కు చేరుకుంది. కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో 9 మంది, చిత్తూరులో ఏడుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపురంలో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, కర్నూలులో ముగ్గురు, కడపలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు మృత్యువాత పడ్డారు