హైదరాబాద్: ఇంకా బరిలోనే దిగలేదు.. మీడియా మాత్రం ప్రశాంత్ కిషోర్ వ్యూహాస్త్రాలు మొదలైపోయాయి అని గత కొద్దిరోజులుగా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. నంద్యాల ఉపఎన్నిక విషయంలోను జగన్ కు ప్రశాంత్ కిషోర్ పలు వ్యూహాలను సిద్దం చేశారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అవన్ని వట్టి ఊహాగానాలేనని తామింకా పనే మొదలుపెట్టలేదని తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. అంతేకాదు, తన భవిష్యత్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో.. చూచాయగా పార్టీ నేతలకు వివరించే ప్రయత్నం చేశారు. కాగా, 2019ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా.. ఆ పార్టీకి ఎన్నికల వ్యూహాలను సిద్దం చేసే పనిని ఆయన భుజానికెత్తుకున్న సంగతి తెలిసిందే.
బుధవారం నాడు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత అధ్యక్షతన పార్టీ సమావేశం నిర్వహించారు. ఇందులో పలువురు కీలక నేతలు, జిల్లా స్థాయి నేతలు పాల్గొనగా.. సమావేశానికి ప్రశాంత్ కషోర్ ను కూడా ఆహ్వానించారు జగన్. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులను జగన్ ఆయనకు పరిచయం చేశారు.క్షేత్రస్థాయిలో పార్టీ పునాదులు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రశాంత్ కిషోర్ బృందం సంస్థాగత విశ్లేషణకు సిద్దమవుతున్నట్లు జగన్ పార్టీ నేతలకు వివరించారు. శాస్త్రీయ దృక్పథంతోనే వ్యూహాస్త్రాలు ఉండబోతున్నాయని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ నియామకం వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను కూడా జగన్ నేతలకు చెప్పారు.వచ్చే ఎన్నికల్లో పార్టీకి ప్రతికూల పవనాలే వీస్తాయన్న ఊహాగానాలపై జిల్లా అధ్యక్షుడు ఒకరు ప్రశాంత్ కిషోర్ ను ప్రశ్నించారు. సర్వేల పేరిట టీడీపీ అనుకూల మీడియాలో ఈ తరహా ప్రచారం జరుగుతుందని, ఆ సర్వే కూడా మీరే చేయించారన్నట్లు చెబుతున్నారని అడిగారు. దీనికి స్పందించిన ప్రశాంత్ కిషోర్.. అసలు సర్వేలు తమ ప్రవృత్తి కానే కాదని కుండబద్దలు కొట్టేశారు.