కర్నూలు జిల్లాలో చేపల వలకు భారీ కొండ చిలువ చిక్కింది. ఆత్మకూరు మండలంలోని బైర్లూటీ సమీపంలోని సిద్ధాపురం చెరువులో మత్స్యకారులు చేపల వేట కోసం వల వేశారు. అయితే ఆ వలలో భారీ కొండ చిలువ చిక్కుకుంది. అమలాపురానికి చెందిన మత్స్యకారులు సిద్ధాపురం చెరువులో చేపలు పడుతున్నారు. ఇందులో భాగంగా వల వేశారు. వల బరువుగా ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. జాగ్రత్తగా బయటకు తియ్యగా భారీ కొండ చిలువ దర్శనమిచ్చింది. దాంతో ఒక్కసారిగా షాక్ కు గురైన వారు తర్వాత తేరుకున్నారు. వలలో కొండ చిలువ చిక్కుకుందని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని వల నుంచి కొండచిలువను బయటకు తీసి నల్లమల అభయారణ్యంలో వదిలేశారు. దాంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.