వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ ను టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తన కుమారులతో కలిసి జగన్ ను కలిశారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లతో కలిసి జగన్ ను కలిశారు. విశాఖపట్నం జిల్లాను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమారులు ఇద్దరూ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఇకపోతే వాసుపల్లి గణేష్ గత కొద్దిరోజులుగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు విశాఖను ఎగ్జిక్యూటివ్ కేంద్రంగా ప్రకటించన నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మౌనంగా ఉన్న ఆయన ఇవాళ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. వాస్తవానికి వాసుపల్లి గణేష్ అనధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్లేనని తెలుస్తోంది. గణేష్ ఇకపై వైసీపీకి అనుబంధంగా ఉంటారని ప్రచారం జరుగుతుంది. వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలగిరి దారిలోనే గణేష్ కూడా పయనిస్తారని తెలుస్తోంది.