ఇప్పటికే చైనా, భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించి మన దేశాన్ని రెచ్చగొడుతోంది డ్రాగన్. ఇలాంటి పరిస్థితుల్లో భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చైనా ఇంటెలిజెన్స్కు చేరవేస్తున్నాడు ఓ జర్నలిస్ట్. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఢిల్లీలో అతడిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని పీతమ్పరాకు చెందిన రాజీవ్ శర్మ అనే వ్యక్తి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు. విలేఖరి ముసుగులో చైనా గూఢచారిగా పనిచేస్తూ.. మన దేశ రహస్యాలను చైనాకు లీక్ చేస్తున్నాడు. అందుకోసం అతడికి పెద్ద ఎత్తున డబ్బులు అందుతున్నాయి. డొల్ల కంపెనీల ద్వారా అతడికి డబ్బు చెల్లిస్తున్న చైనాకు చెందిన ఓ మహిళను, నేపాలీని ఈరోజు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.రాజీవ్ శర్మను సెప్టెంబర్ 14న స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసి.. సెప్టెంబర్ 15 కోర్టులో హాజరుపరిచారు. అతడిని ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. సున్నితమైన సమాచారాన్ని అందించినందుకుగాను చైనా ఇంటెలిజెన్స్ విభాగం అతనికి భారీ మొత్తంలో డబ్బు చెల్లించిందని డీసీపీ సంజీవ్ కుమార్ యాదవ్ తెలిపారు. వారివద్ద పెద్ద మొత్తంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.