అమ్మాయిలు చదువుల్లో రాణిస్తారు. ఇంకా పై చదువులు చదువుకుని రాణించాలనే ఎన్నో కలలు కంటారు. ఏదో సాధించాలనే తపన పడుతుంటారు. కానీ చాలామందికి ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. దాంతో మధ్యలోనే చదువులు ఆపేస్తారు. ఈ పరిణామంతో దేశంలో ఎంతోమంది అమ్మాయిలు వారు అనుకున్నది సాధించలేకపోతున్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం అండగా నిలుస్తోంది.ప్రతిభ ఉన్నా పై చదువులు చదవలేని పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అనేక స్కాలర్షిప్పులు అందిస్తోంది. ఇలా ఓ చక్కటి పథం ద్వారా అమ్మాయిలు రూ.50,000 వరకు స్కాలర్షిప్ పొందవచ్చు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్-AICTE ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ పేరుతో అమ్మాయిలకు ఆర్థికంగా చేయూతనిస్తోంది. ఈ స్కాలర్షిప్కు ఎంపికైన అమ్మాయిలు రూ.5,000 నుంచి రూ.50,000 వరకు డబ్బులు అందువకోవచ్చు.టెక్నాలజీలో డిప్లొమా, డిగ్రీ లాంటి కోర్సులు చేసి ఇంజనీర్లు కావాలనుకునే అమ్మాయిలు ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. 2020-21 విద్యా సంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 31 చివరి తేదీ. ఈ స్కాలర్ షిప్ కోసం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా విద్యార్థులు అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఏఐసీటీఈ ఆమోదంతో నడిచే ఇన్స్టిట్యూట్స్లో చదివే విద్యార్థులు మాత్రమే స్కాలర్ షిప్ పొందడానికి అర్హులు.డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్కు దరఖాస్తు చేయొచ్చు. ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు మాత్రమే ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపే ఉండాలి. ఈ స్కాలర్ షిప్కు ఎంపికైన విద్యార్థులకు ప్రతీ ఏడాది రూ.50,000 చొప్పున స్కాలర్షిప్ లభిస్తుంది. ఫస్టియర్ విద్యార్థులకు నాలుగేళ్లు, సెకండియర్ విద్యార్థులకు మూడేళ్ల పాటు స్కాలర్షిప్ లభిస్తుంది.ఈ స్కాలర్ షిప్కు ఎంపికైన విద్యార్థులు ప్రతి సంవత్సరం చదువుకోసం 50,000 రూపాయలను ఒకే మొత్తంగా అందుకుంటారు. ఈ డబ్బులను కాలేజీ ఫీజును చెల్లించేందుకు, పుస్తకాల కొనుగోలుకు, పరికరాల కొనుగోలుకు, ల్యాప్టాప్లు, సాఫ్ట్వేర్ల కొనుగోలు చేసేందుకు వినియోగించుకోవచ్చు. ఈ స్కాలర్ షిప్ కోసం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా NLS పోర్టల్లో రిజిస్టేషన్ చేసుకోవాలి. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు అప్లికేషన్ ఐడీ , పాస్ వర్డ్ వస్తాయి. వీటితో NSP పోర్టల్లో లాగిన్ అయి స్కాలర్ షిప్ అప్లికేషన్ను నింపాలి. అవసరమైన పత్రాలను స్కాన్ చేసి ఆ కాపీలను అప్లోడ్ చేయాలి. ముఖ్యంగా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్, ఇంటర్ సర్టిఫికెట్, ఇన్కం సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్లను సబ్మిట్ చేయాలి. తర్వాత అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి. దాంతో దరఖాస్తు ప్రక్రియ అవుతుంది.ప్రగతి స్కాలర్ షిప్ కోసం AICTE ఆమోదించిన సంస్థలోని సాంకేతిక కోర్సులో ప్రవేశానికి అర్హత పరీక్షలో వారు ప్రదర్శించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పథకాన్ని 2014-15 సంవత్సరంలో ప్రారంభించారు.. అప్పటి నుంచి ఈ స్కాలర్ షిప్తో వేలాది మంది బాలికలు లబ్ధి పొందారు.ఎంతో మంది అమ్మాయిలు ప్రాథమిక స్థాయిలో ఫస్ట్ ర్యాంకులు సంపాదిస్తున్నా ఫీజుల భారంతో తర్వాత చదువులను కొనసాగించలేకపోతున్నారు. డబ్బులు లేవనే నెపంతో ఇంట్లో వాళ్లు ఆడపిల్లలకు చదువెందుకని ఇంట్లో ఉంచేస్తారు. అలాంటి వారి కోసం ఈ లోన్లు ఎంతో ఉపయోగపడతాయి. కాకపోతే చాలామందికి ఇలాంటి స్కాలర్షిప్లు గురించి తెలియకపోవచ్చు. వారికి తెలిసేలా ఈ సమాచారాన్ని షేర్ చేయండి.