ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియన్ ఆర్మీ మానవత్వం.. కృతజ్ఞతలు చెప్పిన చైనా జవాన్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 08, 2020, 07:11 PM

సరిహద్దు వెంట చైనా జవాన్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ.. ఇండియన్ ఆర్మీ మానవత్వాన్ని ప్రదర్శించింది. సరిహద్దు దాటి భారత భూభాగంలోకి వచ్చిన జడల బర్రెలు, దూడలను తిరిగి అప్పగించింది. చైనా అధికారులు వాటిని స్వీకరించిన అనంతరం కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆర్మీకి చెందిన ఈస్ట్రర్న్ కమాండ్ సోమవారం (సెప్టెంబర్ 7) ట్వీట్‌ చేసింది. 13 జడల బర్రెలు, 4 దూడలు ఆగస్టు 31న అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సరిహద్దు వెంట సంచరిస్తూ.. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)ను దాటి భారత భూభాగంలో ప్రవేశించాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇవి అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈస్ట్ కమేంగ్ ప్రాంతంలో తిరుగుతూ కనిపించాయని వెల్లడించారు. వాటిపై మానవత్వం చూపిస్తూ, సెప్టెంబర్ 7న చైనా అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. కొద్ది రోజుల కిందట సరిహద్దు వద్ద దారి తప్పి వచ్చిన చైనీయులకు మన జవాన్లు మార్గదర్శనం చేసి తిప్పి పంపిన విషయం తెలిసిందే.చైనా సరిహద్దు వెంట పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్లు సరిహద్దు వెంట కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఓ వైపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతూనే.. మరోవైపు దుందుడుకు చర్యలకు దిగుతున్నారు. సరిహద్దు వెంట పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎమ్ నరావణే రెండు రోజుల కిందట పేర్కొన్నారు. మరోవైపు.. గత రాత్రి చైనా జవాన్లు సరిహద్దు వెంట కాల్పులకు తెగబడ్డారు. చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నా.. భారత జవాన్లు సంయమనం పాటించారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. తాజాగా చైనా అధికారిక పత్రికలో భారత్‌పై అక్కసు వెల్లగక్కుతూ వ్యాసం రాశారు. చైనాను భారత్ తక్కువ అంచనా వేస్తోందని, యుద్ధం వస్తే 1962 కంటే దారుణమైన ఓటమిని చవిచూడాల్సి వస్తోందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa