చెత్త ఏరుకొని జీవించే ఓ యువకుడు వరద నీటిలో మునిగిపోతున్న ఓ బాలుడి ప్రాణాలు కాపాడి దుర్మరణం పాలైన విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని గజియాబాద్లో చోటు చేసుకుంది. గజ ఈతగాళ్లు అతడి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. గౌశాలలోని ఓ అండర్పాస్ వద్ద శుక్రవారం (ఆగస్టు 28) మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మేరకు..అర్జున్ అనే 18 ఏళ్ల యువకుడు కొన్నేళ్లుగా గజియాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గుడిసెల్లో మరి కొంత మందితో కలిసి నివాసం ఉంటున్నాడు. చెత్త ఏరుకొని జీవనం సాగిస్తున్నాడు. అతడికి నా అనే వారెవరూ లేరు. స్థానికులు ఆ యువకుడిని హడ్డీ అని పిలుచుకుంటారు. శుక్రవారం మధ్యాహ్నం అర్జున్ కొంత మంది మిత్రులతో కలిసి వెళ్తుండగా.. గౌశాల అండర్పాస్ వద్ద ఓ బాలుడి (12) ఆర్తనాదాలు వినిపించాయి. అండర్పాస్ వద్ద వరదనీటిలో మునిగిపోతున్న ఆ బాలుడు కాపాడమంటూ కేకలు వేశాడు. అది గమనించిన అర్జున్ క్షణం ఆలస్యం చేయకుండా వరద నీటిలో దూకాడు. బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు. అయితే ఇంతలో వరద నీరు పెరిగి అతడు ఆ నీటిలో మునిగిపోయాడు.అర్జున్ వరద నీటిలో మునిగిపోవడం గమనించిన అతడి మిత్రుడు గుడ్డూ పెద్దగా కేకలు వేశాడు. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. అర్జున్ అప్పటికే వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో గాలించగా వరద నీటిలో ఓ చోట అర్జున్ మృతదేహం లభించింది. అతడి మరణవార్త తెలిసి స్థానికుల కళ్లు చెమర్చాయి. బాలుడిని కాపాడి తాను వరద నీటికి బలవడం పలువురిని కంటతడి పెట్టించింది. అర్జున్కు బంధువులు ఎవరైనా ఉన్నారా అనే విషయంపై ఆరా తీస్తున్నట్లు విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో దేవేంద్ర విస్త్ తెలిపారు. అతడి ఫోటోలను పలు పోలీస్ స్టేషన్లకు పంపించినట్లు వెల్లడించారు. అర్జున్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక హాస్పిటల్కు తరలించినట్లు తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa