ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈసారి ఆమెను సొంత కుటుంబ సభ్యులే టార్గెట్ చేశారు. ఎమ్మెల్యే అదితి సింగ్ తమను వేధిస్తుందంటూ బామ్మ కమలా సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆస్తి కోసం తన మనవరాలైన ఎమ్మెల్యే అదితి సింగ్ వేధిస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 10న రాయ్ బరేలీ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో కమలా సింగ్ ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ స్వప్నిల్ మాంగేన్ తెలిపారు.కేసు విచారణాధికారిగా అదనపు ఎస్పీ నిత్యానంద్ రాయ్ ను నియమించినట్లు స్పష్టం చేశారు. ఆస్తి వివాదంలో తనను వేధిస్తుందని కమాలా సింగ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆకోణంలో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. మహరాజ్గంజ్లోని లాలుపూర్ గ్రామంలో నివసించే 85 ఏళ్ల కమలా సింగ్.. మనవరాలైన అదితీ సింగ్ పై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతోపాటు ఆమె బంధువులు తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డిసెంబరు 30, 2019న తన ఇంట్లో ప్రవేశించి ఆస్తి మొత్తం వారి పేరిట బదిలీ చేయనట్లయితే అంతు చూస్తామంటూ బెదిరించారని తెలిపారు.అయితే తన బామ్మ కమలా సింగ్ ఫిర్యాదుపై అదితి సింగ్ ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. మరోవైపు ఈ కేసుకు రాజకీయ రంగు పులుముకుంది. స్థానిక ఎమ్మెల్యేపై ఫిర్యాదు అందినప్పటికీ ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఎమ్మెల్యే అదితి సింగ్ పై ఇతర పార్టీల నేతలు విమర్శల దాడికి దిగుతున్నారు.పెద్దల్ని గౌరవించమని బీజేపీ చెప్పలేదా అంటూ దాడికి దిగుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై యూపీ బీజేపీ కార్యదర్శి చంద్రమోహన్ ఘాటుగా స్పందించారు. కుటుంబ వ్యవహారాన్ని రాజకీయం చేసేందుకు వెంపర్లాడటం సరైంది కాదు. సిగ్గుపడాలి అంటూ ధ్వజమెత్తారు. ఒక మహిళ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం సరికాదంటూ మండిపడ్డారు. మెుత్తానికి ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. మరి ఎమ్మెల్యే అదితీ సింగ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa