ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా అంతంపై ఊరటనిస్తున్న ఐఓఆర్ రిపోర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 21, 2020, 05:35 PM

యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్- 19 మహమ్మారి భారత్ లోనూ ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. రోజూ వేలసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కేసుల సంఖ్య 29 లక్షల మార్క్ దాటింది. ఈ నేపథ్యంలో టైమ్స్ ఫ్యాక్ట్-ఇండియా అవుట్ బ్రేక్ నివేదిక(IOR) చెబుతున్న విషయాలు ఊరట కలిగించేలా ఉన్నాయని 10 టీవీ కథనం పేర్కొంది. ఇంతకీ ఆ నివేదిక ఏం వెల్లడిస్తుందంటే...డిసెంబర్ 3 నాటికి భారత్ లో కరోనా అంతం అవుతుందని ఐఓఆర్ తెలిపింది. సెప్టెంబర్ తొలి వారానికి కరోనా కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరుతుందని అంచనా వేసిన ఈ రిపోర్టు, ఆ సమయానికి యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 7.80 లక్షల వరకూ ఉంటుందని చెప్పింది. అప్పట్నుంచీ సెప్టెంబర్ 16 దాకా కేసుల సంఖ్య స్థిరంగా ఉంటుంది. ఆ తర్వాత కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చి.. డిసెంబర్ మొదటివారం నాటికి కేసులు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని తెలిపింది.


వైరస్ వ్యాప్తి తొలి దశలో ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కేసుల సంఖ్య చాలా తీవ్రంగా ఉండి, ఇప్పుడు తగ్గిన నేపథ్యంలో, ఐఓఆర్ అంచనాలు ఆశలను పెంచుతున్నాయి. ఢిల్లీలో 58లక్షల మందిలో కరోనా యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని ఇటీవల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.


మహా నగరాల్లో కేసుల సంఖ్య తగ్గుతూ, పట్టణాలు, గ్రామాల్లో పెరుగుతున్నందున, ఇకపై మధ్య, చిన్న శ్రేణి పట్టణాలపై ప్రభుత్వాలు దృష్టిని సారించాలని సూచించింది. సూరత్, జైపూర్, నాసిక్ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతోందని గుర్తు చేసిన ఐఓఆర్, నవంబర్ మూడో వారం నుంచి ఈ ప్రాంతాల్లో కూడా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని, ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తున్న రేటు కూడా తగ్గుతోందని గుర్తు చేసింది.


సెప్టెంబర్ 2 నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య గరిష్టానికి చేరితే, ఏపీలో ఆగస్టు 23 నాటికి పతాకస్థాయికి కరోనా కేసులు చేరుకోవచ్చని, ఆ తర్వాత నెమ్మదించి అక్టోబర్ 28 నాటికి పూర్తిగా తగ్గుముఖం పట్టొచ్చని నివేదిక అంచనా వేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆగస్టు 15 నాటికే కరోనా తీవ్రత పతాక స్థాయికి చేరుకుందని, అక్టోబర్ 17 నాటికి పూర్తిగా కరోనా అంతం కావొచ్చంది. మొత్తంగా భారత్ లో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతం అవుతుందని నివేదికలో స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa