గుంటూరు: తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, పీడిత ప్రజల పక్షాన పోరాడడం కోసం వచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ అన్నారు. ఇంతకుముందు చెప్పినట్లు 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తానని, శాసనసభలో చేనేత కళాకారుల వాణిని వినిపిస్తానని ప్రకటించారు. తాను కావాలంటే పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండగలను కానీ, అలా చేయడం వల్ల చేనేత కళాకారుల కష్టాలు తీరవన్నారు. కోట్ల సంపాదనపై తనకు ఆశ లేదని అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో నిర్వహించిన చేనేత సత్యాగ్రహ దీక్షకు హాజరైన పవన్ దీక్ష చేపట్టిన కార్మికులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. తనకు చిన్నప్పటి నుంచి చేనేత కళాకారుల కష్టాలు తెలుసన్నారు. వారిని కార్మికులు అని పిలిచి కించపరొచొద్దని సూచించారు. 11 రకాల ఉత్పత్తులు చేతి మగ్గాలపైనే తయారు చేయాలని, పవర్లూమ్స్ పేరిట కార్మికుల పొట్టకొడుతున్న వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.