ముంబై: రాన్సమ్వేర్ పెట్యా వైరస్ దాడి భారత్పైన కూడా జరిగింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్పై వైరస్ దాడి జరిగినట్లు తెలిసింది. జేఎన్పీటీలో ఉన్న మూడు టర్మినళ్లలో ఒక్క దాంట్లో కంప్యూటర్లు హాక్ అయినట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం ప్రపంచవ్యాప్తంగా పెట్యా వైరస్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడి వల్ల యూరోప్లో చాలా వరకు బ్యాంకులు, పెద్ద పెద్ద కంపెనీల కంప్యూటర్లు స్తంభించాయి. పోర్ట్ రవాణ వ్యవస్థను చూసుకునే మొల్లర్-మెయర్స్క్ సంస్థకు అనుబంధంగా జేఎన్పీటీలో ఓ టర్మినల్ పనిచేస్తున్నది. అయితే అందులో ఉన్న కంప్యూటర్ల హ్యాక్కు గురైనట్లు అధికారులు తేల్చారు. ఈ టర్మినల్ సుమారు 20 లక్షల సామర్థ్యం ఉండే స్టాండర్డ్ కంటెయినర్ యూనిట్లను ఆపరేట్ చేస్తుంది. అయితే ఇక్కడ కంప్యూటర్లు మాల్వేర్ వల్ల నిలిచిపోయినట్లు తెలుస్తున్నది.