ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటితో రాష్ట్రపతి నామినేషన్ల గడువు పూర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 28, 2017, 09:34 AM

ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నిక రాజకీయాలు తుది అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే నామినేషన్ వేసిన ఎన్డీయే అభ్యర్థి కోవింద్ మద్దతు కూడగట్టేందుకు జోరుగా పర్యటనలు చేస్తుంటే.. ఇవాళ నామినేషన్ వేయనున్న విపక్ష అభ్యర్థి మీరాకుమార్.. ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అటు ఎన్డీయే, ఇటు విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు కోసం మిగతా పార్టీలతో జోరుగా చర్చలు జరుపుతున్నాయి. జులై 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ సహా ఇప్పటివరకూ 64 నామినేషన్లు దాఖలవగా.. నేడు యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్  నామినేషన్ వేయనున్నారు.  యూపీఏ అధినేత్రి సోనియా, వామపక్షాలు, తృణమూల్, ఇతర పార్టీల నేతలతో కలిసి వెళ్లి మీరాకుమార్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. తాను రాష్ట్రపతిగా ఎన్నికైతే ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయ్యం, పత్రికా స్వేచ్ఛను కాపాడతానని విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరాకుమార్ అన్నారు. పేదరికం, కుల జాడ్యాలను నిర్మూలిస్తానని తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన 17 రాజకీయ పార్టీలకు  కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ అనంతరం అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం నుంచి రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇక రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్  జమ్ముకాశ్మీర్‌లో పర్యటించనున్నారు. శ్రీనగర్లో ఆయన .. రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ అవుతారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు కోరతారు. జమ్ముకాశ్మీర్ పర్యటన తర్వాత కోవింద్ పంజాబ్, హర్యానాలో పర్యటిస్తారు. బరిలో నిలిచిన అభ్యర్థులు కొందరే అయినా.. ఒక్కొక్కరూ గరిష్టంగా నాలుగు నామినేషన్లు సమర్పించే అవకాశం ఉండడంతో వాటి సంఖ్య 64 సెట్లకు చేరింది. సెక్యూరిటీ డిపాజిట్ కట్టకపోవడం, ధ్రువీకరణ పత్రం సమర్పించకపోవడంతో రిటర్నింగ్ ఆఫీసర్ ఇప్పటికే కొన్ని నామినేషన్లను తిరస్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com