ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోవిడ్ బాధితుల్లో వారికి మరణం ముప్పు ఎక్కువ!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 16, 2020, 11:06 AM

గుండె సమస్యలున్న కోవిడ్-19 రోగులకు మరణం ముప్పు ఎక్కువని ఇటలీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఇటలీలోని మ్యాగ్నా గ్రేషియా యూనివర్సిటీ వైద్య నిపుణుల బృందం ఈ అధ్యయనం చేపట్టింది. కరోనా వైరస్, బాధితుల్లో ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన ప్రభావాన్ని చూపుతోంది. కొందరు తమకు కరోనా సోకిందన్న విషయం తెలియకుండానే కోలుకుంటున్నారు. మరికొందరు తమ ఇళ్లలోనే స్వల్ప కోవిడ్ లక్షణాలను జయిస్తున్నారు. మరికొందరు శ్వాస సమస్యలతో ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కొందరు కోవిడ్ బాధితులు తీవ్ర న్యుమేనియాతో ఆరోగ్యం విషమించి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇలా బాధితుల్లో కరోనా వైరస్ ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన ప్రభావాన్ని ఎందుకుచూపుతోందన్న అంశంపై మ్యాగ్నా గ్రేషియా యూనివర్సిటీ వైద్య నిపుణులు అధ్యయనం జరిపారు.అధ్యయనంలో భాగంగా ఆసియా, యూరప్, ఆమెరికాలో కరోనా ఆస్పత్రుల్లో చికిత్స పొందిన 77,317 మంది రోగులకు సంబంధించి పబ్లిష్ చేసిన 21 అధ్యయనాలకు సంబంధించిన డేటాను వారు విశ్లేషించారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే సమయానికి వీరిలో 12.89 శాతం మందికి గుండె సమస్యలుండగా...36.08 శాతం మందిలో అధిక రక్తపోటు, 19.45 శాతం మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. గుండె రుగ్మతలున్న కోవిడ్ రోగులు చికిత్స పొందే సమయంలో గుండె సమస్య మరింత తీవ్రం అవుతోంది. దీంతో ముందుగా గుండె రుగ్మతలతో సతమతమవుతూ కోవిడ్ బారినపడే బాధితుల్లో మరణం ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేల్చారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని గుండె సమస్యలున్న కోెవిడ్ రోగులకు చికిత్స కల్పించే విషయంలో వైద్యులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తమ అధ్యయనంలో తేలిన అంశాలు...గుండె సమస్యలు కలిగి కరోనా బారినపడిన వారికి అందించే చికిత్సలో ఉపకరిస్తుందని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తంచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa