న్యూదిల్లీ: దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.16,000 కోట్ల షేర్లను పునః కొనుగోలు(బై బ్యాక్) చేసేందుకు ఆమోద ముద్ర వేసింది. ఈక్విటీ షేరుకు రూ.2,850 చొప్పున మొత్తం షేర్లలో 2.85శాతాన్ని కొనుగోలు చేయడానికి కంపెనీ ప్రతిపాదించింది. ‘కంపెనీకి చెందిన 5.61 కోట్ల ఈక్విటీ షేర్లను పునఃకొనుగోలు ప్రతిపాదనకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. ఈ షేర్లను రూ.16వేల కోట్లకు మించకుండా కొనుగోలు చేస్తారు’ అని బీఎస్ఈ ఫైలింగ్ సందర్భంగా టీసీఎస్ తెలిపింది. టీసీఎస్ షేర్లను పునఃకొనుగోలుచేయాలన్న ప్రతిపాదనను కంపెనీ షేర్లహోల్డర్లు చేశారని సంస్థ తెలిపింది. ప్రత్యేక తీర్మానం ద్వారా దీనికి బోర్డు సభ్యులు ఆమోదం తెలిపినట్లు వెల్లడించిన సంస్థ, టెండర్ ఆఫర్ ద్వారా బైబ్యాక్ను చేపట్టనున్నట్లు వివరించింది. ఇందుకోసం ప్రకటన ప్రక్రియ కొనసాగుతోందని సంస్థ స్పష్టం చేసింది.