ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఎస్టీ అమలుతో పెరగనున్న చిన్నకార్లు ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 27, 2017, 10:18 AM

జీఎస్టీ అమలులోకి రానున్న నేపథ్యంలో చిన్న కార్ల ధరలు స్వల్పంగా పెరుగనున్నాయి. నాలుగు మీటర్లలోపు పొడువు కలిగిన 1.2 లీటర్ల లోపు పెట్రోల్ ఇంజిన్ లేదా 1.5 లీటర్ల లోపు డీజిల్ ఇంజిన్‌తో తయారైన చిన్నరకం కార్ల ధరలు స్వల్పంగా పెరుగనున్నాయి. ప్రస్తుతం ఈ కార్లపై 12.5 శాతం సెంట్రల్ ఎక్సైజ్, 1 శాతం ఇన్‌ప్రా సెస్, 12.5-14.5 శాతం మధ్యలో వ్యాట్‌తో కలిపి 26-28 శాతం వసూలు చేస్తున్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఈ కార్లు 28 శాతం స్లాబ్‌లోకి రానున్నాయి. వీటితోపాటు పెట్రోల్ కార్లపై ఒక శాతం అదనంగా సెస్, డీజిల్ రకం కార్లపై మూడు శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిధిలోకి రానున్న రెనో క్విడ్ కారు రూ.2.65 లక్షల నుంచి రూ.2.71 లక్షలకు పెరుగనున్నది. అలాగే డీజిల్ విభాగానికి చెందిన మారుతి సుజుకీ డీజైర్ రూ.21 వేలు ప్రియంకానున్నది. అలాగే నాలుగు మీటర్ల కంటే అధిక పొడువు కలిగి, 1,500 సీసీ ఇంజిన్‌తో రూపొందించిన కార్లు 43 శాతం పరిధిలోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ కార్లపై 41.5 శాతం పన్ను విధిస్తున్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత హోండా సిటీ బేసిక్ మోడల్ రూ.9 వేలు పెరిగి రూ.7.76 లక్షలకు చేరుకోనున్నది. కానీ లగ్జరీ, అతిపెద్ద కార్లు మాత్రం తగ్గనున్నాయి. ప్రస్తుతం ఈ కార్లపై 44.5 శాతం పన్ను విధిస్తుండగా, జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత 43 శాతం స్లాబ్‌లోకి రానున్నాయి. దీంతో ధరలు 1.5 శాతం మేర తగ్గనున్నాయి. అలాగే స్పోర్ట్స్ యుటిలిటీ వాహన ధరలు భారీగా తగ్గనున్నాయి. ప్రస్తుతం వీటిపై 48 శాతం పన్నును విధిస్తుండగా, జూలై 1 తర్వాత 43 శాతం పరిధిలోకి రానున్నాయి. దీంతో టయోటా ఫార్చ్యునర్ ధర రూ.28.26 లక్షల నుంచి రూ.27.21 లక్షలకు తగ్గనున్నది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com