మానం కంటే ప్రాణం గొప్పదని ఆ మహిళలు భావించారు. వెంటనే తమ చీరలు విప్పి జలాశయంలో కొట్టుకుపోతున్న నలుగురు యువకులను కాపాడేందుకు ప్రయత్నించి మానవత్వం చాటారు. కానీ.. వారు ఇద్దరిని మాత్రమే ప్రాణాలతో ఒడ్డుకు చేర్చగలిగారు. మరో ఇద్దరు నీటిలో మునిగి చనిపోయారు. టిఒఐ కథనం మేరకు.. 12 మంది యువకులు తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాలో కొట్టరాయ్ సమీపంలోని సిరువచ్చుర్ గ్రామంలో క్రికెట్ ఆడేందుకు వచ్చారు. ఆట ముగిసిన తర్వాత వీరంతా కొట్టరాయ్ జలాశయం వద్దకు చేరుకున్నారు. అక్కడ దుస్తులు ఉతికి ఇంటికి తిరిగి వెళ్తున్న ముగ్గురు మహిళలను డ్యామ్లో స్నానం చేయొచ్చా అని అడిగారు.
వరదల వల్ల జలాశయంలో సుమారు 20 అడుగుల ఎత్తు వరకు నీరు చేరిందని, ఈ సమయంలో అందులోకి దిగితే ప్రమాదమని చెప్పారు. ఇంతలో ఇద్దరు యువకులు కాలు జారి డ్యామ్లో పడ్డారు. వారిని రక్షించేందుకు మరో ఇద్దరు నీళ్లలోకి దూకారు. అయితే, ఈత రాకపోవడం వల్ల సాయం కోసం కేకలు పెట్టారు. దీంతో ఆ మహిళలు మరో ఆలోచన లేకుండా తమ వంటి మీద ఉన్న చీరలను విప్పేశారు. నీటిలో మునిగిపోతున్న యువకుల వద్దకు విసిరారు. ఈ సందర్భంగా ఆ మహిళలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి నీటిలోకి దిగారు. ఆ చీరలను పట్టుకుని ఇద్దరు తీరానికి రాగలిగారు. దురదృష్టవశాత్తు మరో ఇద్దరు వారి కళ్ల ముందే నీటిలో మునిగి చనిపోయారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa