నాగాలాండ్: నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్) అధ్యక్షుడు షుర్హొజెలి లీజిట్సు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఎన్పీఎఫ్ శాసనసభాపక్ష సమావేశంలో టి.ఆర్.జెలియాంగ్ స్థానంలో ఆయన్ను ఎన్నుకున్నారు. ఈ నెల 22న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లీజిట్సు వంటి అనుభవం ఉన్న నేత చక్కగా మార్గనిర్దేశం చెయ్యగలుగుతారని రాజ్యసభ సభ్యుడు కె.జి. కెన్య అభిప్రాయపడ్డారు. నాగాలాండ్ పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రమంతటా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు జెలియాంగ్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో జెలియాంగ్ ఆదివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.