ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్పత్రి ఆవరణలోనే మృతదేహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 08, 2020, 08:35 AM

కర్నూలు జిల్లా కర్నూలు లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. చికిత్స ఆలస్యం కావడంతో నిండు ప్రాణం బలైపోయింది. కల్లూరు మండలం లక్ష్మీపురానికి చెందిన చెంచురెడ్డి(70) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈనెల 4న అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు కర్నూలు ఆర్టీసీ బస్టాండు వద్దనున్న ఆసుపత్రిలో చూపించగా వైరల్‌ జ్వరంగా పేర్కొని మందులు రాసిచ్చి పంపారు.కొద్దిగా కోలుకున్నట్లు కనిపించిన ఆయన శుక్రవారం తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక్కడ పడకలు లేవని కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని గూడూరు మండలం పెంచికలపాడు గ్రామ సమీపంలో ఉన్న విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రిలో చేర్పించాలని వైద్యులు సలహా ఇచ్చారు.కుటుంబ సభ్యులు సదరు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడా ఖాళీ లేవని పెద్దాసుపత్రికే తీసుకెళ్లాలని సూచించారు. అప్పటికే ఊపిరి ఆడక కొట్టుమిట్టాడుతున్న చెంచురెడ్డిని ద్విచక్ర వాహనంపై సుమారు 20 కి.మీ. దూరంలోని కర్నూలుకు తరలించేసరికి ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో చనిపోవడంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచక ఆసుపత్రి ఆవరణలో నేలపైన మృతదేహాన్ని ఉంచి శోకసంద్రంలో మునిగిపోయారు.తర్వాత వైద్యులు మృతదేహాన్ని ప్యాకింగ్‌ చేసి అప్పగించడంతో స్వగ్రామానికి తీసుకెళ్లారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని, ఆసుపత్రిలో చేర్పించుకొని కృత్రిమ శ్వాస అందించి చికిత్స చేసి ఉంటే బతికేవాడని, ఆసుపత్రుల చుట్టూ తిప్పడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa