ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమాన ప్రమాదంలో 17 మంది దుర్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 08, 2020, 08:08 AM

కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి 7.45కి ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. వందేభారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుంచి కోజికోడ్ కు వస్తున్న ఎయిరిండియా విమానం రన్ వే పై నుంచి ప్రమాదవశాత్తు జారి 35 అడుగుల లోతులో ఉన్న లోయలో పడింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందగా 125 మంది గాయాపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 10 మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కలిపి మొత్తం 191 మంది ఉన్నారు. మృతుల్లో పైలట్ దీపక్ సాథే,కో పైలట్ ఉన్నారు. 125 మందికి గాయాలు కాగా వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఇందులో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది.వర్షం కారణంగా విమానం రన్ వే పైకి రాగానే జారి లోయలో పడి కింద ఉన్న గోడను ఢీకొని రెండు ముక్కలుగా విరిగిపోయింది. వెంటనే 30 అంబులెన్స్ లను,ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పించి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. భారీ వర్షం కురుస్తుండడంతో రాత్రి వేళ సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. సహాయ కార్యక్రమాలను రాష్ట్ర మంత్రి మొయినుద్దీన్‌ పర్యవేక్షిస్తున్నారు. రన్‌వే పై చివరి వరకు విమానం వేగంగా వెళ్లి లోయలో పడి, రెండు ముక్కలుగా విరిగిపోయిందని డీజీసీఏ ప్రకటించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది. విమానం ల్యాండింగే సరిగ్గా జరగనట్లుగా ప్రాథమిక సమాచారం ఉందని డీజీసీఏ డైరెక్టర్‌ అరుణ్‌ కుమార్‌ వెల్లడించారు.ఈ ఘటన పై సీఎం పినరయి విజయన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే యంత్రాంగమంతా సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన ఆదేశించారు. ప్రధాని మోడీ సీఎం విజయన్ కు ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి సహాయం అందిస్తామన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడిన ప్రయాణికులు, సిబ్బంది వివరాలు తెలిపేందుకు షార్జా, దుబాయ్‌ల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. +971565463903, +9715430 90572, +971543090575 హెల్ప్‌లైన్‌లను ప్రారంభించారు. బాధితుల కుటుంబ సభ్యులకు పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అక్కడి భారత రాయబారి డాక్టర్‌ అమన్‌ పురి తెలిపారు. కేరళలోని బాధితుల కుటుంబ సభ్యుల కోసం 0495–2376901 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు కోళీకోడ్‌ కలెక్టర్‌ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa