పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 17 నుంచి ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 11 వరకు ఇరవై రోజులపాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షతన శుక్రవారం రాత్రి పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమై తేదీలను ఖరారు చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. ఈ సమావేశాల ప్రారంభం నాడే రాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. లోక్సభ సభ్యుడు వినోద్ ఖన్నా, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి మృతికారణంగా తొలిరోజు ఉభయసభలూ వాయిదా పడుతాయి.పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో గంగానదికి సంబంధించి బిల్లును కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టనుంది. కార్మిక మంత్రిత్వశాఖ సైతం కోడ్ ఆన్ వేజెస్ అనే కనీస వేతన బిల్లును ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న కనీస వేతన చట్టం, వేతనాల చెల్లింపు చట్టం తదితర 44 చట్టాలను కుదించి నాలుగు చట్టాలకే పరిమితం చేసే ఉద్దేశంతో ఈ నూతన బిల్లును ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర సామాజిక సంక్షేమ మంత్రిత్వశాఖ బిల్లును ప్రవేశపెట్టనుంది. అటు బ్యాంకులకు మొండి బకాయిల నియంత్రణకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నది.