ముంబయి: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా తన వాహన శ్రేణిలోని వివిధ వాహనాలపై ధరలను తగ్గించనుంది. జులై 1 నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త పన్నుల ప్రకారం వివిధ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని వాహన తయారీ సంస్థలు యోచిస్తున్నాయి. బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి వాహన తయారీ సంస్థలు తగ్గింపు ధరలను ఇప్పటికే ప్రకటించగా.. ఈ జాబితాలో హోండా వచ్చి చేరింది.‘ధరల తగ్గింపు అనేది రాష్ట్రానికి-రాష్ట్రానికీ, వస్తువుకి-వస్తువుకీ మధ్య తేడా ఉంటుంది. ఈ తగ్గింపు సగటున 3 నుంచి 5శాతం ఉండొచ్చు. జీఎస్టీ ప్రకారం ఏ ప్రయోజనాలు చేకూరతాయో అవన్నీ వినియోగదారులకు బదిలీ చేస్తాం’ అని హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు వైఎస్ గులేరియా తెలిపారు బజాజ్ ఆటో ఇప్పటికే వివిధ వాహనాలపై రూ.4500 వరకూ తగ్గించింది. ఇక రాయల్ఎన్ఫీల్డ్ సైతం జూన్ 17, 2017 నుంచి జీఎస్టీకి అనుగుణంగా ధరలను తగ్గించినట్లు తెలిపింది. ప్రీమియం వాహనాల ధరల విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. 350సీసీ దాటిన వాహనాలపై అదనంగా 3శాతం సెస్ విధించే అవకాశం ఉంది. 28 శాతం పన్ను కిందకు ఇవి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రీమియం బైక్ల విషయంలోనే ధరల పెరుగుదల ఉండగా, మిగిలిన వాహనాల ధరల్లో తగ్గుదల కనిపించనుంది.