హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి బుల్లెట్ నడిపి వారిని ఉత్సాహపరిచారు. ఈ ఉదయం చిల్లమత్తూరుకు చేరుకున్న బాలయ్యకు తెదేపా శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికాయి. అభిమానుల కేరింతల మధ్య అక్కడి నుంచి బుల్లెట్పై ర్యాలీగా హిందూపురానికి చేరుకున్నారు. అనంతరం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీతతో కలిసి బాలయ్య పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.22 కోట్ల వ్యయంతో చేపట్టిన మాతా-శిశు వైద్యశాలను ప్రారంభించిన సందర్భంగా మంత్రి సునీత మాట్లాడుతూ.. బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుంచీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.