ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతాంగానికి సాగు సలహాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 23, 2020, 12:53 PM

ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రాష్ట్ర రైతాంగానికి అందించిన వాతావరణ ఆధారమైన వ్యవసాయ సలహాలు..గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు మరియు చాలా చోట్ల మరియు చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 28-35 డిగ్రీల సెల్సీయస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21-26 డిగ్రీల సెల్సీయస్ గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో చాలా చోట్ల తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 26-36 డిగ్రీల సెల్సీయస్ మధ్య మరియు రాత్రి ఉష్ట్రోగ్రతలు 20-27 డిగ్రీల సెల్సీయస్ మధ్య నమోదు కావొచ్చు.


వాతావరణ ఆధారమైన వ్యవసాయ సూచనలు..


- భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో వర్షాధార పంట పొలాల్లో నుంచి మురుగునీటిని తీసివేయాలి.


 


వరి..


1. రైతులు స్వల్పకాలిక వరి రకాల నారు మళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం


2. రైతులు తెలంగాణ సోన(RNR 15048) వరి విత్తనాన్ని జూలై 25 వరకు నారు పోసుకోవాలి.


3. వరిలో తాటాకు తెగులు(హిస్సా) ఉనికిని గమనించడమైనది. తెగులు ఉధృతి గమనిస్తూ కుదురుకు రెండు పురుగులు లేదా రెండు ఆకుల నష్టం గమనించినట్లైతే నివారణకు, 2 మి.లీ ప్రొఫినోపాస్ లేదా 2.5 మి.లీ క్లోరిఫైరిఫాస్ లేదా 2 మి.లీ క్వినాల్ఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.


 


మొక్కజొన్న..


-మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్లుగా గమనించడమైనది. నివారణకు..


1. విషపు ఎర తయారు చేసుకోవడానికి గాను 10 కిలోల వరి తవుడులో 2 కిలోల బెల్లాన్ని కలిపి 2-3 లీటర్ల నీటిని చేర్చి సుమారు 24 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు వంద గ్రాముల థైడికార్బ్ కలుపుకుని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్క సుడులలో వేసు కోవాలి.


2. హిమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా లేదా క్లోరాట్రినిలిప్రోల్ 0.4 మి.లీ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.


 


పత్తి..


1. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో రసం పీల్చే పురుగుల ఆశించడానికి అనుకూలం. నివారణకు మోనోక్రోటోపాస్ మందును మరియు నీటిని 1:4 నిష్పత్తిలో కలిపి లేత కాండంపై మెత్తని బ్రష్ తో విత్తిన 30 రోజుల పైరుకు పూయాలి.


 


సోయా చిక్కుడు..


-ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సోయాచిక్కుడులో పెంకు పురుగు ఆశించడానికి అనుకూలం. నివారణకు 1.25 మి.లీ ట్రైజోఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


 


కూరగాయలు..


1. కూరగాయల పంటలలో రసం పీల్చే పురుగులు గమనించినట్లైతే, నివారణకు రెండు మి.లీ డైమిథోయేట్ లేదా 1.5 గ్రా ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


2. టమాటా, వంగ మరియు మిరప నారు మళ్లు పోసుకోవాలి.


3.నీటి వసతి గల ప్రాంతాలలో బెండ, చిక్కు, మరియు తీగజాతి కూరగాయలను విత్తుకోవాలి.


4.అధిక వర్షాలు మరియు ఆకాశం మేఘావృతం అయి ఉండడం వలన కూరగాయ పంటల నారు మళ్లలో నారు కుళ్లు తెగులు సోకుటకు అనుకూలం. నివారణకు ఈ క్రింది యాజమాన్య పద్దతులు పాటించాలి.


-3 గ్రా. కాపర్-ఆక్సీ-క్లోరైడ్ మందును ఒక లీటరు నీటికి కలిపి నారుమడిని పూర్తిగా తడపాలి.


-నారుమళ్లలో మురుగు నీటి వసతిని ఏర్పటు చేసుకోవాలి.


-విత్తే ముందు కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ మరియు 3 గ్రా. కాప్టాన్ చొప్పున విత్తన శుద్ధి చేసి నారుమడిలో రసం పీల్చే పురుగులు, ఆకుమచ్చ తెగుళ్లను నివారించవచ్చు.


-విత్తనాలను ఎత్తైన నారుమళ్లలో 10 సెం.మీ ఎడంతో వరుసలతో విత్తుకోవలెను.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa