‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ‘ పాటకి ప్రాణం పోసిన టంగుటూరి సూర్యకుమారి చాలా చిన్నప్పుడే, ఆరితేరిన గాయకురాలిగా, నృత్య కళాకారిణిగా ప్రసిద్ధికెక్కిన తెలుగు ఆడపడుచు. టంగుటూరి ప్రకాశం పంతులుగారి రాజకీయ ఉపన్యాసాలకి నాందిగా ఆవిడ చక్కని జాతీయ గీతాలు పాడేవారు. ఎన్నోఆనాటి చలన చిత్రాల్లో నటించి ఖ్యాతి గడించారు. ఇంగ్లండులో స్థిరవాసం ఏర్పరచుకొని, ఆవిడ మన తెలుగు వారి సాంస్కృతిక రాయబారి అయ్యారు. అక్కడ నృత్యకళాశాల కూడా పెట్టారు. టంగుటూరి సూర్యకుమారి నవంబర్ 13,1925న రాజమండ్రిలో జన్మించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క తమ్ముడు టంగుటూరి శ్రీరాములు కూతురు. 1937లో మద్రాసు వచ్చి, సినీరంగ ప్రవేశము చేశారు.నటన కంటే సూర్యకుమారి పాడిన దేశభక్తి గీతాలు, లలితగీతాలు, అష్టపదులు వంటి వాటికి ఎక్కువ ప్రజాదరణ లభించడంచేత ఆమె పాట కచేరీలు తరుచూ చేస్తుండేవారు. తెలుగు, తమిళము, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో నటించిన సూర్యకుమారి మంచి గాయకురాలు కూడా. స్వాతంత్రోద్యమ సమయంలో మా తెలుగు తల్లికి మల్లెపూదండ, దేశమును ప్రేమించుమన్నా మొదలైన అనేక దేశభక్తి గీతాలు పాడారు. ప్రకాశం పంతులు ఈమె కళాభిరుచిని బాగా ప్రోత్సహించారు. శాస్త్రీయ సంగీతం నేర్పించారు. ఏ సభకు వెళ్ళినా ఆమెను తీసుకెళ్ళి జాతీయ గీతాలు పాడించేవారు. 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్టావతరణ సభలో నెహ్రూ, రాజాజీ, ప్రకాశం ప్రభృతుల సమక్షంలో వందేమాతరం, 'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' పాటలు ఆలపించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు. 1975లో హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభ ఆమె సేవలను గుర్తించి సత్కరించింది. 1979లో రాజ్యలక్ష్మి అవార్డుతో ఆమెను గౌరవించింది. ప్రముఖ చిత్రకారుడు హెరాల్డ్ ఎల్విన్తో ను వివాహమాడిన సూర్యకుమారి లండన్ లోనే స్థిరపడ్డారు. ఏప్రిల్ 25, 2005న తుది శ్వాస విడిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa