టెక్నాలజీతో పనులు సులభం కావడంతో పాటు..కొత్త సమస్యలు పెరిగాయి. ఇందులో భాగంగా భారతదేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇలా ఎన్నో కేసులు పలు సందర్భాల్లో బయటకొచ్చాయి.ఆన్లైన్లో బాలికలు సైతం ఎక్కువగా బెదిరింపులకు, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇదే ఏడాది మేలో ఢిల్లీలో కొంతమంది యువకులు ఇన్స్ట్రాగ్రామ్లో పెట్టుకున్న బాయిస్ లాకర్ రూమ్ పెద్ద సంచలనంగా మారింది. ఇన్స్టాలో బాయిస్ లాకర్ రూమ్ పేరిట ఓ గ్రూప్ను ఏర్పాటు చేసి బాలికల ఫొటోలను మార్ఫింగ్ చేసి కామెంట్లు చేసేవారు. బాలికల ఫొటోలను నగ్న ఫొటోలుగా మార్ఫ్ చేసి, గ్రూప్ చాట్ రూమ్లో షేర్ చేసుకుంటూ అసభ్యకర, నేరపూరిత సందేశాలను పంపుకునేవారు. ఇది ఓ విద్యార్థిని చొరవతో బయటపడింది. వెంటనే పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు.2019లో తమిళనాడులోని పొల్లాచ్చిలో కళాశాల విద్యార్థినులతో ఫేస్ బుక్ ద్వారా ఫ్రెండ్స్గా పరిచయమై.. ప్రేమిస్తున్నానని లొంగదీసుకుని.. లైంగిక వేధింపులకు గురిచేసే ముఠాను పోలీసులు గుర్తించారు. కళాశాల విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడి.. ఆ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ యువతిని నగ్నంగా వేధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో బయటకురావడంతో ఈ విషయం బయటపడింది.సోషల్ మీడియాలో మహిళలను వేధించిన కారణంగా 2017లో ముంబైలో ప్రముఖ వ్యాపారవేత్త మహేష్ మూర్తిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తమను లైంగికంగా వేధింపులకు గురించి పలువురు మహిళలు ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. మెసెజ్లు ద్వారా తమను వేధించేవాడని మహిళలు పోలీసు శాఖకు ఫిర్యాదు చేశారు.సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు సైతం సోషల్ మీడియాలో లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఇటీవలె ఓ ప్రముఖ మహిళా కమెడియన్ లైంగిక వేధింపులకు గురయ్యారు. దీంతో వేధింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైకు చెందిన స్టాండప్ కమెడియన్ అగ్రిమా జాషువా 2019లో మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతున్న చత్రపతి శివాజీ విగ్రహం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే వడోదరకు చెందిన శుభం మిశ్రా అనే వ్యక్తి అగ్రిమాపై తీవ్ర అసభ్య పదజాలంతో దూషించాడు. ఆమెను లైంగిక వేధింపులతో బెదిరించాడు. బెదిరింపులకు దిగుతూ మిశ్రా శనివారం ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు.2018లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి మీటూ ఉద్యమం రాజుకుంది. అప్పట్లో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా, బాలీవుడ్ నటుడు నానా పటేకర్ సినిమా షూటింగ్ సమయంలో తనను వేధించారని ఆరోపించారు. ఆ తర్వాత ఇతర మహిళలు చాలా మంది కూడా వరసగా తమపట్ల జరిగిన లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించడం ప్రారంభించారు. మహిళలు తమ పట్ల ఆఫీసుల్లో జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పడానికి ధైర్యంగా ముందుకు వచ్చారు. తమ పట్ల జరిగిన లైంగికంగా వేధించిన పురుషుల చాట్ స్క్రీన్ షాట్లు సోషల్మీడియాలో షేర్ చేశారు.ఆన్లైన్ మహిళా వేధింపులకు సంబంధించి ట్రూ కాలర్ నిర్వహించిన సర్వేలో భారతదేశంలోని ప్రతి ఐదు మందిలో ఒక మహిళ లైంగిక వేధింపుల సమస్యతో బాధపడుతున్నట్టు తేలింది.దేశంలో 85 శాతం మంది మహిళలు తమకు వచ్చిన అనుచితమైన కాల్స్ నెంబర్లను బ్లాక్ చేశారు. వేధింపుల కాల్స్ 76% కంటే ఎక్కువగా అపరిచితుల నుంచి వస్తాయని కనుగొన్నారు. 4 శాతం మాత్రమే తెలిసిన వ్యక్తుల నుంచి వస్తున్నట్లు తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa