దేశంలో పేరెన్నికగన్న భారత విమానయాన సంస్థ ఎయిరిండియా దాదాపు 15 వేలమంది ఉద్యోగులకు మూడేళ్ల నుంచి అయిదేళ్ల వరకూ వేతన రహిత సెలవును ప్రకటించే పథకాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలిపింది. అయితే ఈ ప్రాతిపదికన కంపెనీ వదలి వెళ్లేవారు అదే సీనియారిటీ, అదే వేతనం ప్రాతిపదికన తిరిగి కంపెనీలో చేరవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. బుధవారం ఎయిరిండియా సిఎండి రఘు మీనన్ ఓ ప్రకటన విడుదల చేస్తూ 15 వేలమంది సంస్థ ఉద్యోగులను 3 ఏళ్లనుంచి 5 ఏళ్లవరకు వేతనం ఇవ్వని ప్రాతిపదికన సెలవుపై పంపాలని యోచిస్తున్నట్లుగా చెప్పారు. అయితే ఇలా లీవుపై వెళ్లిన వారు కోరుకుంటే తమ స్థాయి ప్రాతిపదికన తిరిగి సంస్థలోకి చేరవచ్చని పేర్కొన్నారు.దేశంలోని ప్రముఖ ప్రైవేట్ విమాన సంస్థ జెట్ ఎయిర్వేస్ దేశీయ విమానయాన రంగంలో ఆర్థిక సంక్షోభం తాకిడికి 1,100 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఎయిరిండియా సిఎండి ప్రకటన వెలువడటం గమనార్హం. అయితే బుధవారం పౌర విమానయాన శాఖ మంత్రి ప్రపుల్ పటేల్ ఓ ప్రకటన వెలువరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిరిండియాలో ఉద్యోగులను తొలగించే ప్రశ్నే లేదని చెప్పారు. ఎయిరిండియా సంస్థ లోని ఉద్యోగుల సంఖ్యను ఇప్పటికిప్పుడు తగ్గించే ఆలోచన తమకు లేదని మంత్రి చెప్పారు. ఉద్యోగాలు తొలగించడమనేది సంస్థ వృద్ధి ప్రణాళికలను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఉద్యోగులను తొలగిస్తే భవిష్యత్తులో సంస్థ ఆర్థిక స్థితి మెరుగు పడినప్పుడు సంస్థలో ఉపాధి అవకాశాలను అది దెబ్బతీస్తుందని ప్రపుల్ చెప్పారు.ఎయిరిండియాలో ఇంతవరకు పనిచేస్తున్న వారు ఇకపై కూడా తమ ఉద్యోగాల్లో కొనసాగవచ్చని, వారితో తమకు ఎలాంటి సమస్యలూ లేవని మంత్రి చెప్పారు. మంత్రి చెప్పిన మాటల తడి ఆరకముందే ఎయిరిండియా సంస్థ ఎండీ 15 ఉద్యోగులకు సామూహిక వేతన రహిత లీవు గురించి ప్రకటించి బాంబు పేల్చడం గమనార్హం. 77 సంవత్సరాల చరిత్ర ఉన్న ఎయిరిండియా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తోంది. సంస్థ వెయ్యినుంచి 1500 కోట్ల విలువైన ఈక్విటీ కేపిటల్ను తీసుకోవాలని, మరో రూ. వెయ్యి కోట్ల తేలికపాటి రుణాలను తీసుకోవాలని చూస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa