ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయ్యో దివ్య.. పెళ్లయిన 4 నెలలకే ..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 08, 2020, 07:28 PM

అదనపు కట్నం వేధింపులు, అత్తింటి ఇబ్బందులు తట్టుకోలేక ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురం మండలంలోని బతికపల్లికి చెందిన ఐలేని అంజిరెడ్డి, శోభారాణి దంపతుల చిన్న కూతురు దివ్య(22) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఆమెకు అదే గ్రామానికి చెందిన పెయ్యాల రాజిరెడ్డి, అంజలి దంపతుల కుమారుడు ప్రవీణ్‌రెడ్డితో ఈ ఏడాది ఫిబ్రవరి 22న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.10 లక్షలు, 20 తులాల బంగారం, ఎకరం భూమిని కట్నంగా ఇచ్చారు. పెళ్లయిన తర్వాత కూడా దివ్య హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా, ప్రవీణ్‌రెడ్డి గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు.కొద్దిరోజులుగా అదనపు కట్నం తేవాలని, కట్నంగా వచ్చిన పొలాన్ని అమ్మేసి డబ్బు తీసుకురావాలని అత్తమామలు దివ్యను ఇబ్బందులు పెట్టారు. భర్త కూడా వాట్సాప్‌ ద్వారా అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ మానసికంగా వేధించాడు. దీంతో దివ్య తట్టుకోలేక నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి పుట్టింటికి వచ్చి విషయాన్ని చెప్పింది. దీంతో ఆమె పుట్టింటివారు మంగళవారం తమ కూతురిని వెంటబెట్టుకుని ప్రవీణ్‌రెడ్డి ఇంటికి వెళ్లి చర్చించారు. ఈ సమయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన దివ్య నేరుగా గ్రామ శివారులోని తమ పుట్టింటికి చెందిన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి దూకి ఆత్మహత్య చేసుకుంది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న తమ కూతురును అత్తింటివారు పొట్టనబెట్టుకున్నారంటూ దివ్య తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa