ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 29, 2020, 04:33 PM

గర్భిణితో ఉన్న మహిళ చనిపోవడంతో పుట్టెడు దుఖంలో ఉన్న ఆ కుటుంబ సభ్యుల పట్ల ఆ గ్రామస్తులు రాక్షసుల్లా ప్రవర్తించారు. కడుపులో బిడ్డ ఉండగా అంత్యక్రియలు నిర్వహించొద్దంటూ అడ్డుకున్నారు. దీంతో చేసేదేం లేక ఆ మహిళ మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో చెట్టుకు కట్టేసి వచ్చారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రుద్రవరం మండలం బి.నాగిరెడ్డిపల్లెకు చెందిన ధర్మేంద్ర, లావణ్యకు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది జరిగింది. నిండు గర్భిణీ అయిన లావణ్యను డెలివరీ కోసం శుక్రవారం రాత్రి నంద్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అయితే అక్కడి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో లావణ్య బిడ్డకు జన్మనివ్వకుండానే ప్రాణాలు వదిలింది. దీంతో లావణ్య మృతదేహాన్ని స్వగ్రామం బి.నాగిరెడ్డిపల్లెకు తరలించారు.అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుపడ్డారు. గర్భంలో బిడ్డ ఉండగానే అంత్యక్రియలు చేస్తే గ్రామానికి అరిష్టమంటూ అంత్యక్రియలను అడ్డుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు చేసేదేం లేక అర్ధరాత్రి సమయంలో లావణ్య మృతదేహాన్ని వాహనంలో నల్లమల అటవీ ప్రాంతానికి తరలించారు. అక్కడ అప్పనపల్లె సమీపంలోని పులిబోను వాగు ప్రాంతంలో ఓ చెట్టు మొదలు వద్ద లావణ్య మృతదేహాన్ని తాళ్లతో కట్టేసి తిరిగి వచ్చారు. ఆదివారం రుద్రవరం, గోనంపల్లె, అప్పనపల్లె గ్రామాలకు చెందిన కొంతమంది పొలం పనులకు వెళ్తుండగా దారి మొత్తం పూలు చల్లి ఉండడాన్ని గుర్తించారు. ఇందులో కొంతమంది ధైర్యం చేసి ముందుకు వెళ్లి చూడగా.. అక్కడ చెట్టు మొదట్లో మృతదేహం కన్పించడంతో భయపడి వెనక్కి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరిపి విషయాన్ని తెలుసుకున్నారు. మృతురాలి బంధువులు, గ్రామస్తులతో మాట్లాడి అంత్యక్రియలు నిర్వహించేలా చూస్తామని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa