హైదరాబాద్: రిలయన్స్ జియో వినియోగదారులకు నిజంగా ఇది షాకింగ్ వార్తే. ఎందుకంటే ఈ మధ్య ఇలాంటి మెసేజ్ చాలా మందికి వస్తోంది. జియోతో మీ డైలీ డేటా లిమిట్ను అప్గ్రేడ్ చేసుకోండి, అంటూ ఏదైనా మెసేజ్ మీ మొబైల్కొస్తే జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే ఒక్కసారి ఆ మెసేజ్లో ఉన్న లింక్ను క్లిక్ చేస్తే చాలు మీ పర్సనల్ డేటా అంతా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జియో యూజర్లను ఇలాంటి మెసేజ్లు కలవరపాటుకు గురిచేస్తున్నాయి.‘రిలయన్స్ జియో వినియోగదారులు తమ రోజువారీ డేటా డౌన్లోడ్ పరిమితిని 1 జీబీ నుంచి 10 జీబీకి అప్ గ్రేడ్ చేసుకునేందుకు ఈ లింక్ మీద క్లిక్ చేయండి’ అని ఓ లింక్ ఇస్తున్నారు. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, అడ్రస్ వంటి వినియోగదారుడి వ్యక్తిగత సమాచారం అడుగుతున్నారు. అన్ని వివరాలు రాబట్టిన తర్వాత ఇక రెండో స్టెప్లో ‘‘మీ వాట్సప్ గ్రూప్లోని మిగతా ఫ్రెండ్స్ కూడా జియో సేవలను అప్గ్రేడ్ చేసుకునేందుకు గ్రూప్లోని మిగతా ఫ్రెండ్స్తో కూడా దీన్ని షేర్ చేసుకోండి’’ అని అడుగుతారు.
లేదా ‘‘ జియో సర్వీసును అప్గ్రేడ్ చేసుకునేందుకు మీరు కనీసం పది మంది ప్రెండ్స్కి దీన్ని షేర్ చేయాలి’’ అని చెబుతున్నారు.
http://upgrade-jio4g.ml/ పేరుతో అచ్చం జియో కంపెనీకి చెందినట్టు చూపిస్తూ ఫేక్ ఆఫర్లలోకి సైనప్ అయ్యేలా బోల్తా కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి మెసేజ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు. ఇది ఫేక్ అని జియో యూజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు నిపుణులు. కనుక జియో వినియోగదారులారా డేటా ఫ్రీగా వస్తుందని ఆశపడి అలాంటి మెసేజ్ల జోలికి వెళ్లకండి..! ఆ తరువాత ఏదైనా జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.