ఆంధ్రప్రదేశ్ లో యువతలో నైపుణ్యం పెంపొందించి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 30 చోట్ల స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు నిర్మించనున్నారు. ఆ అంశంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాలేజీల నిర్మాణ నమూనాలను సీఎంకు అధికారులు చూపించారు. ఈ కాలేజీల్లో 20 రంగాలకు చెందిన అంశాలపై నైపుణ్యాభివృద్ధి బోధన జరగాలని సీఎం ఆదేశించారు.120 కోర్సుల్లో బోధన, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఉంటుందని అధికారులు సీఎంకు వివరించారు. స్థానిక పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, అంతర్జాతీయ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఇక్కడ నిర్వహించే కోర్సుల్లో కియా, ఐటీసీ, టెక్ మహీంద్ర, హెచ్సీఎల్, హ్యుందాయ్, వోల్వో, బాష్ వంటి కంపెనీల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏపీఎస్సీహెచ్ఈ, ఐఐఐటీ బోధనా సిబ్బందితో అడ్వాన్స్డ్ కోర్సుల్లో శిక్షణ ఉండాలన్నారు. 30 కాలేజీల నిర్మాణానికి దాదాపు రూ.1210 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు, కంపెనీలకు మధ్య నిరంతరం సంబంధాలు ఉండాలని సీఎం జగన్ సూచించారు. మారుతున్న టెక్నాలజీని పరిగణలోకి తీసుకుని ఆ మేరకు శిక్షణ ఇవ్వాలని.. యువతలో నైపుణ్యాన్ని మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. కాలేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ చదివిన విద్యార్థుల వివరాలపై సర్వే చేయాలని సీఎం జగన్ సూచించారు. తర్వాత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. ఈలోగా పరిశ్రమలకు అవసరాలు ఏంటో తెలుసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa