ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలు ఉద్యోగాల కోసం తమ స్వస్థలకు వెళ్లాలా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 17, 2020, 02:26 PM

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి భారత్ లో తీవ్ర స్థాయిలో ఉంది. రోజుకు 11వేలకుపైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం లాక్ డౌన్ సడలింపులు ప్రకటించడంతో కోవిడ్- 19 మహమ్మారి కోరలు చాచింది. కరోనా కష్టకాలంలో కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించాయి. లాక్ డౌన్ సడలింపులతో మళ్ళీ కొందరు ఉద్యోగులు ఆఫీసులకు వెళ్తున్నారు. ముంబై, హైదరాబాద్, చెన్నై లాంటి మహానగరాల్లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. రోజూ వందలాది కేసులు నమోదవుతున్నాయి. మహానగరాల్లో ఉద్యోగం చేస్తున్న వారు అక్కడి నుండి స్వస్థలాల బాట పడుతున్నారు. అందుకు కంపెనీలు కూడా అంగీకారం తెలుపుతున్నాయి.మహానగరాల్లో కరోనా రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా అక్కడి నుండి బయటపడాలని చూస్తున్నారు. కరోనా మహమ్మారి ఉద్ధృతి తగ్గాక మళ్ళీ నగరానికి వస్తామని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల్లో ఎక్కువ శాతం కొన్ని రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వాటిలో కూడా ఎక్కువగా మహానగరాల్లోనే ఉన్నాయి. అందుకే నగరవాసులంతా సొంత ప్రాంతాలకు పయనమవుతున్నారు. అదేవిధంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు కూడా తమ ప్రాంతంలోనే ఉద్యోగాల వెతుకులాటలో నిమగ్నమయ్యారు. మరోవైపు ఉద్యోగ సాధనకు నగరాలకు వచ్చినవారు తిరుగు ప్రయాణమవుతున్నారు.కరోనా మహమ్మారి దెబ్బకు నగరాల్లో ఉండాలన్నా, నగరాలకు వెళ్లాలన్నా ప్రజలు భయపడుతున్నారు. దీంతో కంపెనీలు కూడా ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం లేదు. మరోవైపు ఉద్యోగాలు కోల్పోయిన వారి పరిస్థితి వర్ణనాతీతం. తీవ్ర ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్ని కంపెనీలు ఆర్ధిక సమస్యలతో తమ ఉద్యోగులకు జీతాలు తగ్గించి ఇస్తున్నాయి. ఇది కూడా వారు తమ స్వస్థలాలకు వెళ్ళడానికి ఒక కారణం. ఈ కరోనా మహమ్మారి ప్రజల జీవితాల్లో పెనుమార్పులను తీసుకువచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa