కర్కశ రక్కసిపై కఠోర యుద్ధం చేస్తున్న ప్రజాసైనికులకు వందనం. ఆర్మీలో పోరాటం చేస్తే తమ ప్రాణాలు పోతాయని తెలుసు... తమ ప్రాణాలు పోతే కుటుంబం ఒంటరి అయిపోతుందని తెలుసు... కానీ తమ ప్రాణం కంటే తమ కుటుంబం కంటే దేశ రక్షణే లక్ష్యంగా భారత దేశ సరిహద్దుల్లో ఆర్మీ జవాన్లు ప్రాణాలర్పించి మరీ దేశానికి రక్షణ కవచంలా నిలుస్తున్నారు. అసలు జవానులే లేకపోతే ఈరోజు మనం ఇంత సంతోషంగా ఎలాంటి ప్రాణ భయం లేకుండా ఉండేవాళ్లమా? భరతమాత మీద అసలు సిసలైన ప్రేమ ఉన్నది జవానులకు మాత్రమే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కంఠంలో ప్రాణమున్నంత వరకు... దేహంలో ఊపిరి ఉన్నంత వరకు ప్రతిక్షణం దేశం కోసం పరితపిస్తున్న జవానుల కారణంగానే దేశ ప్రజలందరూ ప్రాణ భయం లేకుండా నిశ్చింతగా జీవించగలుగుతారు. శత్రువులతో పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు ఎంతోమంది. తాజాగా నిన్న లద్దాఖ్ సమీపంలోని గల్వాన్ వ్యాలీలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ స్థాయి అధికారితో పాటు మరో ఇద్దరు జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఆ కల్నల్ ఎవరో కాదు మన తెలుగువారే.సోమవారం రాత్రి జరిగిన ఇరు దేశాల సైనికుల ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు అమరుడయ్యారు. సంతోష్ ఏడాదిన్నరగా దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు. ఆయన మృతితో సూర్యాపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. కల్నల్ సంతోష్ బాబు 6వ తరగతి నుంచి కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అనంతరం ఇండియన్ మిలటరీ అకాడమీలో చదువుకున్నారు. చదువు పూర్తైన తర్వాత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తున్నారు. మొత్తం 15 ఏళ్లుగా ఆయన విధుల్లో ఉన్నారు. తన సర్వీస్లో ఎక్కువ కాలం కాశ్మీర్, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్, పాకిస్థాన్ సరిహద్దులోనే విధులు నిర్వహించారు. కొంతకాలం భారత ఆర్మీ తరపున కాంగో దేశంలోనూ పనిచేశారు. 37 సంవత్సరాల చిన్న వయసులో కల్నల్గా పదోన్నతి పొందారు. 2007లో పాకిస్తాన్ బోర్డర్లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించారు.సంతోష్ బాబు మరణంతో ఆయన కుటుంబం కన్నీటిపర్యంతమైంది. ఒక్కగానొక్క కుమారుడు దేశం కోసం ప్రాణాలు కోల్పోయినా ఆ తల్లిదండ్రుల్లో ధైర్యం ఏమాత్రం చెక్కు చెదరలేదు. వారిలో ఆ జవాన్ నింపిన ధైర్యం అలాంటిది. ఇండియన్ ఆర్మీ పవర్ అలాంటిది. తనకు మరణం ఏ సమయంలో, ఏ రూపంలో వచ్చినా కుంగిపోవద్దని తల్లిదండ్రులకు, భార్యకు ముందే ధైర్యం చెప్పాడు. కొడుకు చనిపోయినా సరే తన తల్లి ఉబికివస్తున్న కన్నీళ్లను కూడా దిగమింగుకొని ధైర్యంగా నిల్చుంది. తన కొడుకు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు గర్వంగా ఉందని చాటి చెప్పింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు యావత్ భారతం కన్నీటి నివాళులు అర్పిస్తోంది. వీర సైనికులకు లోకల్ యాప్ సెల్యూట్ చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa