ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగదు చెల్లించి బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే పన్ను భారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2017, 07:51 AM

హైదరాబాద్‌: నగదు చెల్లించి బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే పన్ను పడుతుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రూ.2 లక్షలకు మించి నగదు ఇచ్చి జరిపే కొనుగోళ్లపై ఒక శాతం ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్ - మూలాధార పన్ను)‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. నిజానికి రూ.5 లక్షల వరకు బంగారాన్ని నగదు ఇచ్చి కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతకుమించి కొనుగోలు చేస్తేనే టీసీఎస్ చెల్లించాలి. అయితే బడ్జెట్‌లో బంగారాన్ని సాధారణ వస్తువుల జాబితాలోకి ప్రభుత్వం చేర్చింది. దీంతో ఇక నుంచి రూ.2 లక్షలకు మించి బంగారాన్ని నగదుతో కొనుగోలు చేస్తే టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. తాజా బడ్జెట్‌లో రూ.3 లక్షలకు మించి నగదు ద్వారా లావాదేవీలు జరపడాన్ని నేరంగా గుర్తించారు. ఒక వేళ నగదు తీసుకుంటే ఎంతమొత్తం తీసుకున్నారో అంతే మొత్తం జరిమానాగా చెల్లించాలి. నగదు తీసుకున్న వ్యాపారే ఈ జరిమానా కట్టాల్సి ఉంటుంది.


ఈ నిబంధన ఆధారంగానే టీసీఎస్‌ వసూలు చేయనున్నారు. ‘రూ.2లక్షలకు మించి నగదు ద్వారా వస్తువు కొనుగోలుకు జరిపే లావాదేవీలపై 1 శాతం టీసీఎస్‌ విధించాలని ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 206సి సబ్‌సెక్షన్‌ (1డి)లో పేర్కొన్నారు. వస్తువు అంటే ఆభరణం అని కూడా అని నిర్వచనంలో చేర్చినందున టీసీఎస్‌ వర్తిస్తుంద’ని ఓ అధికారి స్పష్టతనిచ్చారు. ఇంతవరకు బంగారం, వెండి బిస్కెట్లు, ముక్కలు కొనుగోలుకు మాత్రమే ఈ నిబంధన ఉండగా, దాన్ని ఆభరణాలకు కూడా వర్తింపజేయనున్నారు. ఒకే రోజున గానీ, ఏకమొత్తంలో గానీ రూ.2 లక్షలకు మించి చెల్లిస్తే టీసీఎస్‌ విధిస్తారు. బంగారం రూపంలో అధికంగా నల్లధనం చలామణి అవుతున్నందున దాన్ని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిబంధనను పొందుపరిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com