దక్షిణ భారతీయులకు అత్యంత ఇష్టమైన అల్పాహారాల్లో అది ప్రథమ స్థానంలో ఉంటుంది.. భారతీయులకు మాత్రమే కాదు ఉపఖండ వాసులందరికీ ఇది సుపరిచితం.. అంతేకాదు దానిపేరు మీద ఒక పండుగ కూడా ఉంది. ఇవి ఉడిపి హోటళ్ళలో బాగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఉపోద్ఘాతమంతా దేనిగురించో మీకు ఈపాటికే అర్ధమై ఉంటుంది. అవును దోసె గురించే మనం మాట్లాడుకుంటున్నది. దోసెలు దక్షిణ భారతదేశ అల్పాహారములో అతి ప్రాముఖ్యమైనది. దీన్నే కొన్ని ప్రాంతాల్లో అట్టు అని కూడా పిలుస్తారు. అట్లతద్దె పండుగా తెలుగు రాష్ట్రాల్లోని అమ్మాయిలకు ఎంతో ఇష్టం. అట్ల కొరకు నోములు కూడా చేస్తారు. కన్నెపిల్లలు మంచి భర్త రావాలని కోరుతూ ఈ నోము చేస్తారు.దోశలతో దక్షిణ భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. వీటిలో తెలుగు వారి ప్రత్యేకం పెసరట్టు. ఇది దక్షిణ భారతదేశానికి చెందినదైనప్పటికీ ఈ ప్రాంతంలోనే ఇది మొదట ఉద్భవించిందనేది మాత్రం ఊహాజనితం. ఆహార చరిత్రకారుడు కె.టి. ఆచయ తెలిపిన దాని ప్రకారం, ప్రాచీన తమిళ దేశంలో దోసె వంటిది 1వ శతాబ్దం ఎ.డి. నాటికే వినియోగంలో ఉంది. కర్ణాటకలోని ఉడిపి పట్టణంలో దోసె ఉద్భవించిందని చరిత్రకారుడు పి. థానపాన్ నాయర్ తెలిపారు. దీనికి కారణం ఉడిపి రెస్టారెంట్లలోని పదార్థాలు దోసెకు అనుబంధంగా ఉండటమే. కర్ణాటకలో మొట్టమొదటిసారిగా రూపొందించబడిన పలుచగా, కొద్దిగా కరకరలాడుతూ ఉండే ఈ దోసె మాత్రం భారతదేశం అంతటా జనాదరణ పొందింది.దోసె ఏవిధమైన చక్కెరలు లేదా సంతృప్త కొవ్వులు ఉండకుండా కేవలం కార్బోహైడ్రేట్లను అధికంగా కలిగి ఉంటుంది. ప్రొటీన్కు మంచి మూలపదార్థమయిన మినుము, బియ్యంతో ఇది తయారవుతుంది. దోసెకు కావలసిన పిండి కిణ్వ ప్రక్రియ ద్వారా తయారవుతుంది కాబట్టి విటమిన్ బి, విటమిన్ సి మూలపదార్థంలో పెరుగుతాయి. మసాలా దోసె, పేపర్ దోసె, రవ్వదోసె, ఉల్లిదోసె, గుడ్డుదోసె, పెసరదోసె లాంటివి దోసెల్లో ముఖ్యమైన రకాలు.దోసె గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు కదా... మరెందుకు ఆలస్యం దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయడంతో పాటూ మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa