ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీళ్లు తాగితే కరోనా రాదు: ఇది పక్కా ఫేక్ న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 14, 2020, 10:29 AM

కరోనా వైరస్‌ నివారణపై సోషల్ మీడియాలో ఎన్నో సలహాలు, సూచనలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే, చాలామంది కరోనా వైరస్‌ను పూర్తిగా అంచనా వేయకుండా తమకు తెలిసిన చిట్కాలను వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో పోస్టు చేసి ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. కరోనా వైరస్ ఇండియాకు రాకముందే.. కొందరు ఆవు మూత్రం తాగితే మంచిదని, ఆవు పేడలో స్నానం చేస్తే రోగ నిరోధక శక్తి పెరిగి కోవిడ్-19 చచ్చిపోతుందని ఉచిత సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అంతేకాదు, రోజూ వేన్నీళ్లతో స్నానం చేస్తే కరోనా దరిచేరదనే ప్రచారం కూడా చేశారు. అయితే, ఇవన్నీ ఫేక్ న్యూస్ లు. కరోనాకు ఇప్పటివరకు మందు లేదు. ఇంకా కనిపెట్టలేదు కూడా. పైన చెప్పినవన్నీ పాటిస్తే కరోనా సోకదనేది అవాస్తవం.వాట్సాప్‌లో తాజాగా మరో సూచన కూడా వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. నీళ్లు ఎక్కువగా తాగినట్లయితే కరోనా వైరస్ శరీరంలోకి చేరదని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. ప్రతి పావు గంటకు ఒకసారి నీళ్లు తాగుతూ.. మన గొంతును హైడ్రేట్ చేసుకోవాలని, అలా చేస్తే వైరస్ నేరుగా అన్నవాహికలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. అక్కడ విడుదలయ్యే యాసిడ్లు కరోనా వైరస్‌ను చంపేస్తాయని అందులో రాశారు. అయితే, ఇదంతా కట్టుకథ. కరోనా వైరస్ అంత సులభంగా పోయేదైతే ప్రపంచంలో అంతమంది ఎందుకు ప్రాణాలు విడుస్తున్నారు? డాక్టర్లు ఎందుకు శ్రమిస్తున్నారు? పరిశోధకులు ఎందుకు ల్యాబుల్లో కుర్చొని చెమటోడ్చుతున్నారు? నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, వైరస్‌ను చంపేంత శక్తి, సుగుణాలు నీటిలో లేవు. ఇటువంటి ఫేక్ న్యూస్ లు నమ్మొద్దని ఆయా ప్రభుత్వాలు, డబ్ల్యుహెచ్ ఓ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa