దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది విద్యాసంవత్సరం ఉంటుందా? ఉండదా? అన్న అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో ఉన్నత విద్యపై కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఉన్నత విద్యకు సంబంధించిన వివిధ కోర్సులకు సిలబస్తో పాటు, విద్యా సంస్థల పని దినాలను సగానికి తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన తర్వాత పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.బుధవారం కాలేజీల యాజమాన్యాలతో ఆన్లైన్లో నిర్వహించిన సమావేశంలో పరీక్షల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై అధికారులు చర్చించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా ముందుకు సాగితే బాగుంటుందని అభిప్రాయం మెజార్టీగా వ్యక్తం అయ్యింది. అయితే సకాలంలో కేంద్రం మార్గదర్శకాలు వస్తే ఆ విధంగా ముందుకు సాగాలని, లేకపోతే తెలంగాణలో ముందుగా ఆన్లైన్లో పాఠాలు ప్రారంభించాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత ఒక వేళ పరిస్థితులు మారితే తరగతులను నిర్వహించడంపై నిర్ణయం తీసుకోవచ్చనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ఇంజనీరింగ్ ఫైనల్ సంవత్సరం విద్యార్థుల్లో కొందరు విదేశాలకు విద్య, ఉద్యోగాల కోసం ఏటా వెళ్తూ ఉంటారు. అలాంటి వారికోసం ఈనెల 20 నుంచి పరీక్షలు నిర్వహించాల్సిందేనన్న నిర్ణయానికి అధికారులు వచ్చారు. కాలేజీల ప్రారంభించడంతో పాటు ఇతర పరీక్షలు, డిగ్రీ, పీజీ పరీక్షలకు సంబంధించి ఈనెల 15న మరోసారి అధికారులు సమావేశం కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa