ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా ఉత్పత్తులు, యాప్ లపై నిషేధం విధించాలా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 31, 2020, 10:59 AM

చైనాలోని వుహాన్ లో మొదలైన కోవిడ్- 19 మహమ్మారి ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది. అమెరికా, యూరప్ దేశాలు ఈ వైరస్ ధాటికి చిగురుటాకులా వణికిపోయాయి. తాజాగా భారత్ లో కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కరోనా వైరస్ ను వుహాన్ ల్యాబ్ లో సృష్టించి ప్రపంచంపై ప్రయోగించారని ఆరోపించారు. వైరస్ విషయంలో దేశాలను అప్రమత్తం చేయకుండా డబ్ల్యూహెచ్ఓ చైనాకు వత్తాసు పలికిందని, అందుకని దానితో తెగతెంపులు చేసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు.మరోవైపు భారత్ లో కూడా చైనా వస్తువులపై, ఆ దేశానికి సంబంధించిన యాప్ లపై నిషేధం విధించాలని కొన్నిరోజులుగా వివిధ వర్గాల నుండి డిమాండ్లు వస్తున్నాయి. దీనికి నెటిజన్ల నుండి కూడా విపరీతంగా మద్దతు లభిస్తోంది. వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ వేదికలుగా ఈ డిమాండ్లు ఉధృతమవుతున్నాయి. టిక్ టాక్ లాంటి యాప్ లను నిషేధించాలని, అదేవిధంగా చైనాతో వాణిజ్య సంబంధాలను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు. కరోనా వైరస్ తో పాటు సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలు కూడా దీనికి కారణం. ఆర్ధిక నిపుణులు ప్రజల అభిప్రాయాలతో ఏకీభవించడం లేదు.ప్రధాని ఇటీవల ఆత్మనిర్భర భారత్ అనే నినాదాన్ని ప్రకటించారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ వాటిని ప్రమోట్ చేయాలని కోరారు. ఇరుదేశాల మధ్య సమస్యలెన్నివున్నా వాణిజ్య, వ్యాపార సంబంధాలను పెంపొందించుకోవాలని... ఈ రంగాల్లో బంధం బలపడితే సరిహద్దు సమస్యలు సులభంగా సమసిపోతాయని భారత్, చైనాలు గతంలో ఒక అంగీకారానికి వచ్చాయి. 2018–19లో రెండు దేశాల మధ్య బిజినెస్ 7,000 కోట్ల డాలర్ల వద్ద ఉంది.ప్రస్తుతం రెండుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రెండు దేశాలూ పరస్పరం చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. దాని కంటే ముందు వాస్తవాధీన రేఖ వద్ద సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని తెలిపారు. ఘర్షణలు పెరిగితే అది రెండు దేశాలకూ మంచిది కాదని వారు అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్భర భారత్ నినాదానికి అనుగుణంగా భారత్ లో వస్తువుల ఉత్పత్తి ప్రారంభం కావాలని, ఆ విధంగా ప్రభుత్వాలు ఉత్పాదక సంస్థలకు మరింత చేయూతనివ్వాలని కోరుతున్నారు. ప్రజలందరూ కూడా స్థానిక ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు విజ్ఞప్తి చేసారు.చైనా వస్తవులను, యాప్ లను బ్యాన్ చేయడం సమస్యకు పరిష్కారం కాదని భారత్ లోని పరిశ్రమలు తయారీ రంగంపై అధిక దృష్టి సారించి మెల్లమెల్లగా చైనా ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించేలా దృష్టి సారించాలన్నారు. కీలెరిగి వాత పెట్టాలని పేర్కొన్నారు. దీర్ఘకాలంలో చైనాతో వాణిజ్య, వ్యాపార సంబంధాలను తగ్గించుకోవడం ఉత్తమమని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచీకరణ నేపథ్యంలో ఇలాంటి ఉద్రిక్త వాతావరణం మంచిది కాదని వ్యాఖ్యానించారు. కోవిడ్- 19 ముగిశాక భారత్ పెట్టుబడుల కేంద్రంగా మారనుందన్న అంచనాల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాలు ఆవిధంగా చర్యలు ముమ్మరం చేయాలని కోరారు.మరోవైపు చైనా కూడా కరోనా వ్యవహారంలో తన తప్పేమీ లేదని నిరూపించుకోవాల్సిన అవసరముందని నొక్కి వక్కాణించారు. భారత్ తో సంబంధాలను మెరుగుపరచుకునే విషయంపై చైనా దృష్టి కేంద్రీకరించాలని, సరిహద్దుల వద్ద రెచ్చగొట్టే పనులకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు. నేపాల్ చైనాకు తొత్తుగా వ్యవహరించడం మానుకోవాలని హెచ్చరించారు. నేపాల్, చైనాలు ప్రగల్భాలు పలకడం ఆపాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa