ఎల్ఐసీ ఆఫర్ చేస్తున్న పెన్షన్ పథకమే ప్రధానమంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై). ఇందులో చేసిన పెట్టుబడులపై పదేళ్ల పాటు క్రమం తప్పకుండా పెన్షన్ లభిస్తుంది. పదవీ విరమణ తీసుకున్న వారికి.. వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి అందుబాటులో ఉన్న మెరుగైన పథకాల్లో ఇది కూడా ఒకటి. 60 ఏళ్లు, అంతకుపైన వయసున్న ప్రతీ ఒక్కరూ ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అర్హులే. ఇన్వెస్ట్మెంట్ కాల వ్యవధి 10 ఏళ్లు. ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల పాటు పెన్షన్ అందుకోవచ్చు.ప్రతీ నెలా నిర్ణీత మొత్తం పెన్షన్గా అందుకోవాలని ఆశించే వారి ముందున్న స్థిరాదాయ పథకాల్లో.. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్తోపాటు పీఎంవీవీవై కూడా ఒకటి. ఈ పథకంలో పెట్టుబడిపై 2020–21 ఆర్థిక సంవత్సరానికి 7.40 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. కనీస నెలవారీ పెన్షన్ రూ.1,000. గరిష్ట నెలవారీ పెన్షన్ రూ.10,000. త్రైమాసికం వారీగా అయితే కనీసం రూ.3,000, గరిష్టంగా రూ.30,000, ఆరు నెలలకోసారి అయితే కనీసం రూ.6,000, గరిష్టంగా రూ.60,000.. వార్షికంగా అయితే కనీసం రూ.12,000, గరిష్టంగా రూ.1,20,000 పెన్షన్ రూపంలో పొందే అవకాశం ఉంది. నెలవారీగా కనీసం రూ.1,000 పెన్షన్ తీసుకోవాలని భావిస్తే చేయాల్సిన పెట్టుబడి రూ.1,62,162. వార్షికంగా ఒకే విడత రూ.12,000 పెన్షన్ కోసం రూ.1,56,658ని ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఈ పాలసీలో గరిష్టంగా ఒక వ్యక్తి రూ.15లక్షలను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెఫ్ట్ లేదా ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ రూపంలో పెన్షన్ చెల్లింపులు అందుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa