ప్రస్తుతం కరోనావైరస్ కారణంగా అందరూ ఇంట్లోనే ఉండటంతో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. ఈ సమయంలో ఓ అద్భుతమైన పరిశోధన జరిగి ఫలితాలను ఇవ్వడం విశేషమనే చెప్పాలి. అత్యంత వేగవంతమైన స్పీడ్ ఇంటర్నెట్ రాబోతోంది. ఇంటర్నెట్ వినియోగించేవారందరికీ ఇదొక శుభవార్తనే చెప్పాలి. ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు సింగిల్ ఆప్టికల్ చిప్ అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ ను అందించినట్లు వెల్లడించారు. ఒక్క సెకనుకు 44.2 టెరాబైట్ల డేటా వేగాన్ని రికార్డు చేసినట్లు తెలిపారు. ఒక్క టీబీ అంటే 1024 జీబీ అంటే ఈ వేగంతో వినియోగదారులు ఒకే సెకనులో 1000కు పైగా హెచ్ డీ సినిమాలను డౌన్ లోడ్ చేసేయవచ్చు. మెల్ బోర్న్ లో 76.6 కిలోమీటర్ల పొడవైన డార్క్ ఆప్టికల్ ఫైబర్ల ద్వారా ఈ వేగాన్ని సాధించారు. దీంతో ఆస్ట్రేలియాలో టెలి కమ్యూనికేషన్ నెట్ వర్క్ ను వేగవంతం చేయడం మాత్రమే కాకుండా గృహావసరాలకు కూడా అత్యధిక వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. ఈ స్పీడ్ కోసం వినియోగదారులు మైక్రో కోంబ్ అనే పరికరాన్ని ఉపయోగించారు. ప్రస్తుతం టెలి కమ్యూనికేషన్ లో ఉపయోగించే హార్డ్ వేర్ కంటే ఈ మైక్రో బాంబ్ ఎంతో చిన్నగా, తేలికగా ఉంటుంది. మైక్రో కోంబ్ను ఫీల్డ్ టెస్ట్ చేయడం ఇదే మొదటి సారి కావడం విశేషం. అయితే ఇకపై ప్రపంచవ్యాప్తంగా బ్యాండ్ విడ్త్ విషయంలో మైక్రో బాంబ్ వినియోగం పెరిగే అవకాశం పెరగనుంది.