అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : కడప జిల్లాలోని గండికోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరో నెల రోజుల్లో అంకురార్పణ జరగనుంది. గండికోట వద్ద పెన్నా నది భూ నిధిలోని 2వేల ఎకరాల్లో అయిదు జోన్లుగా పర్యాటక వసతులను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రాథమికంగా ప్రతిపాదనలను రాష్ట్ర పర్యాటకాభివృ ద్ధి సంస్థ సిద్ధం చేసింది. ఇక్కడున్న గండికోట, మైలవరం రిజర్వాయర్లు, కోట, ఆలయాలు, రాతి కొండలు, చారిత్రక, వారసత్వ కట్టడాలు, పెన్నా నది ప్రధాన ఆకర్షణలు. 2015లోనే ముఖ్యమంత్రి గండికోటకు వెళ్లినప్పుడు ఆ ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. జమ్మలమడుగు నుంచి గండికోట వరకు ఉన్న 14 కిలోమీటర్ల రహదారిని రూ.16కోట్లతో నాలుగు వరుసల దారిగా విస్తరిస్తామని ప్రకటించారు. ఇప్పుడు కార్యరూపం దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రాజెక్టు స్వరూపం ఇదీ...
చారిత్రక గండికోట పక్కన పెన్నా నది భూ నిధిలో 2వేల ఎకరాల్లో అయిదు జోన్లలో పర్యాటకాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో అభివృద్ధి చేస్తారు. కోట, కెనాయన్, సాహస, థీమ్పార్క, గోల్ఫ ఇలా అయిదు జోన్లుగా ఇక్కడ పర్యాటకాభివృద్ధి పనులు చేపడతారు. కోట, ఇతర పురాతన కట్టడాలను పునరుద్ధరిస్తారు. సౌండ్, లైట్ షో, వారసత్వ నడక వంటివి అందుబాటులోకి తెస్తారు. కెనాయన్ జోన్లో రాతి కొండలపైనుంచి పరిసరాలను చూడడం, హెలికాప్టర్ రైడ్, తాడువంతెన(రోప్-వే)వంటివి ఉంటాయి. గోల్ఫ్ జోన్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గోల్ఫ్ కోర్సును సిద్ధం చేసి, గోల్ఫ్ క్లబ్, అకాడమీ, గోల్ఫ్ రిసార్ట్సను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. సాహసక్రీడల్లో కొండలు ఎక్కడం (రాక్ కై ్లంబింగ్), పారా గ్లెడింగ్, సై ్క డైవింగ్, బోటింగ్, జలక్రీడలు ఉంటాయి. పర్యాటకాభివృద్ధి వ్యూహంలో భాగంగా హంపి, తిరుపతి వంటి వారసత్వ కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను గండికోట నుంచి కలుపుతూ ట్రిప్లు నిర్వహిస్తారు.
వసతులపై అధికారుల అధ్యయనం
ప్రస్తుతం గండికోట వద్ద ఉన్న వనరులు, వసతులు ఏమిటి? ఎక్కడెక్కడి నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు, వారికి వచ్చే మార్గాల్లో ఎలాంటి వసతులు అవసరం, ఇప్పటికే అందుబాటులో ఉన్నవి ఏమిటి వంటి అంశాలపై రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా ఇది కొలిక్కి రానుంది. బెంగళూరు, తిరుపతి, నెల్లూరు నుంచి ఎక్కువగా పర్యాటకులు వస్తున్నందున మొదట ఆ మార్గాల్లో దారి పక్కన వసతులు(వే సైడ్ ఎమినిటీస్) ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) విధానంలో మెరుగుపరచాలని నిర్ణయించారు. మరోవెపు హైదరాబాద్ నుంచి కడపకు ట్రూ-జెట్ సంస్థ విమానాలను తిప్పుతున్నందున కడపలో దిగగానే పర్యాటకులను గండికోటకు రహదారి మార్గంలో తీసుకువెళ్లేలా అదే సంస్థతో పర్యాటకాభివృద్ధి సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఫ్రీ కోట్ సంస్థ ప్రస్తుతం గండికోటలో వారాంతంలో నిర్వహిస్తున్న సాహసక్రీడలను ప్రతిరోజూ డిమాండ్ మేరకు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు. వచ్చే అక్టోబరులో గండికోట ఉత్సవం నిర్వహించనున్నారు. దీనిపై తమిళనాడు, కర్ణాటకల్లో విస్తృతంగా ప్రచారం చేస్తారు. తర్వాత ప్రతి 15రోజులకోసారి గండికోటలోనే ప్రత్యేక కార్యక్రమాలు ఉండేలా చూస్తారు.