లాక్ డౌన్ వల్ల చుక్క దొరక్క మద్యం బాబులు పిచ్చోళ్లు అయ్యారు. నానా అవస్థలు పడ్డారు. చివరికి కొన్ని చోట్ల దొంగతనాలకు కూడా పాల్పడ్డారు. ఆత్మహత్యలు చేసుకోవడానికి పూనుకున్నారు. అయితే ఆ తర్వాత లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వాలు వైన్ షాపులు తెరిచాయి. వైన్ షాపులు తెరవడంతో మందుబాబుల ఆనందానికి అవధుల్లేవు. తాజాగా మందుబాబులకు జార్ఖండ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మద్యాన్ని హోమ్ డెలివరీ చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో మందుబాబులు గంటల తరబడి మండుటెండలో క్యూ లైన్లో నిల్చోవాల్సిన పనిలేదు.
లాక్డౌన్లో ఆర్థికంగా నష్టపోయిన ప్రభుత్వాలు దాన్ని భర్తీ చేసుకునేందుకు మద్యం అమ్మకాల వైపు మొగ్గు చూపక తప్పలేదు. కానీ మందుషాపులు ఓపెన్ అవగానే కిలోమీటర్ల కొద్దీ లైనులు, సామాజిక దూరం అన్న మాట నామమాత్రం కూడా పాటించకుండా ఒకరినొకరు తోసుకుంటూ క్యూలైన్లో నిల్చున్నారు. దీంతో కరోనా కేసులు పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపై అటువంటి సమస్య ఉండకుండా జార్ఖండ్ ప్రభుత్వం దానికో పరిష్కారం చూసింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలతో మద్యం డెలివరీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే జార్ఖండ్ రాజధాని రాంచీలో మద్యాన్ని హోమ్ డెలివరీ చేస్తోంది. ఈ సదుపాయాన్ని త్వరలోనే మిగతా నగరాలకు సైతం అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 'మద్యం-హోం డెలివరీ'పై ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆలోచనలో పడ్డాయి. అదే గనుక జరిగితే అన్ని రాష్ట్రాల్లో మద్యం బాబులు చిందులు వేయడం కచ్చితం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa