కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లో భారత్ లో 132 మంది కన్నుమూయడంతో ఆందోళన ఎక్కువైంది. కరోనా భయం నేపథ్యంలో వేరే రాష్ట్రాల నుంచి వస్తోన్న వారిని 14 రోజులపాటు క్వారంటైన్ సెంటర్లలో ఉంచుతున్న సంగతి తెలిసిందే. వీరిలో చాలా మందిని హోం క్వారంటైన్లో ఉంచుతున్నారు. తాజాగా ఓ గిరిజన బాలింతను స్థానికులు ఊళ్లోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆరు రోజులపాటు ఆమె ఊరి బయట ఉన్న ఓ చెట్టు నీడలోనే గడిపింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రాజులగూడలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బొప్పరికుంట పంచాయతీలోని రాజులగూడకు చెందినన జైతు, అనసూయ దంపతులు ఉపాధి కోసం కరీంనగర్ వలస వెళ్లారు. మే 14న అక్కడే అనసూయ ఓ పాపకు జన్మనిచ్చింది. మరుసటి రోజు వారు సొంతూరు చేరుకోగా స్థానికులు వారిని గ్రామంలోకి రానీయలేదు. దీంతో ఊరి చివరన ఓ చెట్టు కింద గుడారం వేసుకొని నివసించారు. సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది బుధవారం రాజులగూడకు చేరుకున్నారు. తల్లీబిడ్డకు వైద్యపరీక్షలు చేసి ఆరోగ్యంగానే ఉన్నారని తేల్చారు. గ్రామస్థులను ఒప్పించి ఇంట్లోనే క్వారంటైన్లో ఉండే ఏర్పాట్లు చేశారు.