ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యర్థాలతో ఇటుకల తయారీ..ఇది యువ ఇంజినీర్ల స్టార్టప్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 16, 2020, 03:56 PM

బట్టీలలో ఇటుకలను తయారుచేసే ప్రక్రియ వల్ల వాయు కాలుష్యం ఎక్కువవుతోంది. బట్టీల నుంచి హానికరమైన వాయువుల విడుదల వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోంది. అంతేకాకుండా ఇటుకలను భూమిలోని మట్టి ద్వారా తయారు చేస్తారు. మట్టిని తవ్వడం ద్వారా భూమికి నష్టం వాటిల్లుతోంది. దీనివల్ల వ్యవసాయానికి సారవంతమైన నేల ఉండని పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటి సమస్యకే 25 ఏళ్ల రూపమ్ అనే యువకుడు చెక్ పెట్టాడు. అస్సాంలోని గువహతికి చెందిన ఒక పారిశ్రామికవేత్త, యువ ఇంజనీరు.. రూపమ్. తన ముగ్గురు స్నేహితులతో కలిసి రూపమ్ జెరూండ్ బ్రిక్స్ అనే స్టార్టప్ ను స్థాపించారు. మామూలు ఇటుకల వల్ల ఎటువంటి నష్టాలుంటాయనేది రూపమ్ కు తెలుసు. అందుకే ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించాడు. రూపమ్ తో పాటు మౌసమ్ తాలూక్దార్ మరియు డేవిడ్ ప్రతిం గొగోయ్ (సహ వ్యవస్థాపకులు) వంటివారు తన ఆలోచనతో చేయి కలిపారు.
ఈ యువ ఆవిష్కర్తలు వ్యర్థాలతో ఇటుకలను తయారు చేయడానికి పేటెంట్ హక్కులను పొందారు. ప్లాస్టిక్ ఎంబెడెడ్ తేలికపాటి ఇటుకను థర్మల్ పవర్ ప్లాంట్ల నుండి ఫ్లై యాష్, వేస్ట్ ప్లాస్టిక్, సిమెంట్ ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఇటుకలలో 70% వ్యర్థ పదార్థాలను కలిగి ఉంటాయి. బట్టీలలో కాల్చడానికి బదులుగా విద్యుత్ యంత్రాలను ఉపయోగించి తయారు చేశారు. ఇది కార్బన్ ఉద్గారాలను తొలగిస్తుంది. ఈ ఇటుకలు మామూలు ఇటుకల కన్నా 10 శాతం తేలికైనవి. ఆరు మామూలు ఇటుకలతో ఒక జెరండ్ ఇటుక సమానం. మామూలు ఇటుకల కన్నా 10 నుండి 12 శాతం ఎక్కువ థర్మల్ ఇన్సులేషన్‌ను కూడా ఇవి అందిస్తున్నాయి. అంటే ఈ ఇటుకలను ఉపయోగించి తయారుచేసిన నిర్మాణం వేసవికాలంలో చల్లగా ఉంటుంది. శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది.
భారతదేశంలో చాలా నిర్మాణాలు సాగుతున్నాయి. మరి వీటన్నింటికీ పర్యావరణాన్ని హాని కలిగించే ఇటుకలు ముఖ్యమా? అందుకే ఈ యువ ఇంజనీర్లు ఆవిష్కరించిన కొత్త విధానం చాలా మందికి నచ్చింది. వాతావరణాన్ని కాపాడే ఈ ఇటుకలు ఎంతో ఉపయోగకరమైనవి. ఇప్పటికీ ఈ స్టార్టప్ వారు 1000కి పైగా క్లైంట్లకు తమ సేవలను అందించారు. 2.5 లక్షలకు పైగా ఇటుకలను విక్రయించారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మరియు నాగాలాండ్ లోని ఇతర భవనాలలో కనీసం 50కు పైగా పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నిర్మించడానికి ఈ ఇటుకలు ఉపయోగించబడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa