లాక్ డౌన్ వల్ల దేశ వ్యాప్తంగా ఎక్కడివాళ్లు అక్కడ ఉండిపోయారు. చాలా మంది తమ సొంత ఊర్లకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వలస కార్మికుల పరిస్థితి మరీ దయనీయం. తాజాగా ఓ ఘటన అందర్నీ కంటతడి పెట్టించేలా చేస్తోంది. మంచంపై ఓ బాలుడిని పడుకోబెట్టి దాదాపు 1,300 కిలోమీటర్లు కుటుంబ సభ్యులు భుజాన మోసుకెళ్లిన ఘటన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో పంజాబ్లోని లుధియానా నుంచి సొంత గ్రామం మధ్యప్రదేశ్లోని సింగ్రౌలికి ఆ కుటుంబం వెళ్లాలనుకుంది. అయితే, ఆ కుటుంబంలోని ఓ అబ్బాయికి మెడ భాగంలో గాయమైంది. దీంతో అతడు నడవలేని పరిస్థితి తలెత్తింది.లుధియానాలోనే ఉంటే తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి రావచ్చని చేసేదేమీ లేక ఓ మంచంపై ఆ బాలుడిని పడుకోబెట్టి కుటుంబ సభ్యులు మోసుకెళ్లారు. ఇలా వారు దాదాపు 15 రోజులు నడుస్తూనే ఉన్నారు. మధ్యలో పలు చోట్ల ఆగి ఆహారం తిని నిద్రపోతున్నారు. వారు నడుస్తున్న సమయంలో వారి కాళ్లకు చెప్పులు కూడా లేవు. దీంతో వారి కాళ్లకు బొబ్బలెక్కాయి. వారు 15 రోజులు నడిచి యూపీలోని కాన్పూర్ చెక్పోస్టు వద్దకు చేరుకున్నాక పోలీసులు వారి గురించి తెలుసుకుని ఓ వాహనం ఏర్పాటు చేసి సొంతూరికి పంపారు