ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి ఒక్కరికీ రూ. 10 వేలు, రాత్రి 5 గ్రామాల ప్రజలందరికీ భోజనాలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 11, 2020, 05:31 PM

విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన అనంతరం తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ పాల్గొన్నారు. అలాగే విశాఖపట్నం నుంచి మంత్రులు కన్న బాబు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణ దాస్, కలెక్టర్‌ వినయ్‌చంద్, పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్యాస్‌ లీక్‌ ఘటన, అనంతరం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు వివరాలు అందించారు.సీఎం జగన్ ఆదేశాల మేరకు మరణించిన వారి కుటుంబాల్లో లీగల్‌ హెయిర్‌ ఫైనల్‌ అయిన 8 మందిలో ఐదుగురికి రూ. కోటి చొప్పున పంపిణీ చేసినట్లు మంత్రులు వివరించారు. మిగిలి వారు నగరానికి దూరంగా ఉన్నందున వారికి కూడా త్వరలో అందిస్తామని మంత్రులు వివరించారు. అయితే మూడు రోజుల్లోపు మిగతావారికి ఆర్థిక సహాయం అందజేయాలని సీఎం జగన్ ఆదేశించారు. విశాఖ గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో, ఇళ్లల్లో శానిటేషన్‌ పనులు ప్రారంభమయ్యాయని, సాయంత్రం 4 గంటల కల్లా ఇవి ముగుస్తాయని వెల్లడించారు. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రజలను ఊళ్లలోకి అనుమతిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రులు వివరించారు.బాధితులు అనేక మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని, ఎక్స్‌టర్నల్‌ శానిటేషన్, ఇంటర్నల్‌ శానిటేషన్‌పై నిపుణులు స్టాండర్ట్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ ఇచ్చారని, దాని ప్రకారమే శానిటేషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రులు వెల్లడించారు. దీంతో మంత్రులంతా.. గ్యాస్ లీక్ ప్రభావిత 5 గ్రామాల్లో సోమవారం రాత్రికి బస చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. శానిటేషన్‌ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఈ రాత్రికి ఊళ్లోకి వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. గ్యాస్‌ లీక్‌ ప్రభావిత గ్రామాల్లో ప్రతి మనిషికీ రూ.10 వేలు ఇవ్వాలని ఆదేశించారు. పిల్లలైనా, పెద్దలైనా.. అందరికీ రూ. 10 వేల చొప్పున ఇవ్వాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆ ఇంటి అక్కచెల్లెమ్మల బ్యాంకులు ఖాతాల్లో జమచేయాలన్నారు. మంగళవారం ఉదయం వాలంటీర్లతో బ్యాంకు ఖాతాలు సేకరించాలన్న సీఎం ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa