ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తని పొడిచి చంపేసిన భార్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 19, 2020, 02:47 PM

బెంగళూరులో విషాద ఘటన వెలుగుచూసింది. నిద్రపోతున్న భర్తని భార్య కత్తితో దారుణంగా పొడిచేసింది. తీవ్రగాయాలపాలైన భర్తని ఇరుగుపొరుగు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు భార్యని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. అక్కడికి వచ్చిన బంధువులతో తన భర్తని రమ్మని చెప్పండంటూ భార్య గొడవకు దిగడంతో పోలీసులు షాక్‌కి గురయ్యారు. హత్య చేసినందుకు శిక్షించాలో.. ఆమె పరిస్థితి తెలుసుకుని జాలిపడాలో తెలియక తలలు పట్టుకున్నారు. లాక్‌డౌన్‌లో మందులు తీసుకురాలేదన్న కోపంతో ఓ భార్య కట్టుకున్న భర్తని దారుణంగా పొడిచి చంపేసిన ఘటన కోలార్ జిల్లాలో చోటుచేసుకుంది. హొసకోట - హొసూర్ రోడ్డు కిమాద్‌ ఫోర్త్ ఫేజ్‌లో రామస్వామి రెడ్డి(70), గౌరమ్మ(65) దంపతులు నివాసం ఉంటున్నారు. గౌరమ్మ మానసిక పరిస్థితి బాగోకపోవడంతో మందులు వాడుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా భర్త మందులు తీసుకురాకపోవడంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. ఆమె ప్రవర్తన చూసిన భర్త ఏం చేస్తుందోనన్న భయంతో ఇంటికి సమీపంలోనే ఉన్న తమ రెండో ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. అర్ధరాత్రి వేళ అక్కడికి వచ్చిన భార్య గౌరమ్మ పదునైన ఆయుధంతో భర్తను పొడిచేసింది. అతని కేకలు విన్న స్థానికులు పరుగున వచ్చి రక్తపు మడుగులో పడి ఉన్న రామస్వామి రెడ్డిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కోలార్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని భార్యని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్‌కి వచ్చిన బంధువులను చూసిన గౌరమ్మ.. తన భర్త రెడ్డిని రమ్మని చెప్పండనడంతో పోలీసులు కంగుతిన్నారు. తీరా అసలు విషయం తెలిసి జాలిపడాలో.. లేక శిక్షించాలో తెలియక తలలు పట్టుకున్నారు. రామస్వామి రెడ్డి రైతు కాగా.. గౌరమ్మ గృహిణి. వారి జీవితంలో చోటుచేసుకున్న అంతులేని విషాదం ఆమెని మానసికంగా కుంగదీసింది. ఇద్దరు కొడుకులు మరణించడంతో షాక్‌కు గురైన గౌరమ్మ మతిస్థిమితం కోల్పోయింది. వింతగా ప్రవర్తిస్తుండేది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలోనే మందులు తీసుకురాలేదంటూ తీవ్ర ఆగ్రహానికి లోనైన గౌరమ్మ.. భర్తని పొడిచేసింది. అయితే ఆ విషయం ఆమెకి తెలియకపోవడం విషాదం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa